న్యూఢిల్లీ : నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆసుపత్రులు స్టార్ హోటళ్ల సహకారంతో కొవిడ్ టీకా ప్యాకేజీలు ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటళ్లలో టీకాలు వేయడం జాతీయ కొవిడ్ టీకా కార్యక్రమానికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు హోటళ్లలో వ్యాక్సినేషన్ నిర్వహించొద్దంటూ కేంద్రం శనివారం రాష్ట్రాలకు లేఖ రాసింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్ రాష్ట్రాలకు టీకాల నిర్వహణపై లేఖలో వ్యాక్సినేషన్పై మార్గదర్శకాలు సూచించారు.
కేవలం నాలుగు ప్రాంతాల్లోనే వ్యాక్సినేషన్ వేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లు, ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించే సెంటర్లలోనే టీకా వేయాలన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ప్రభుత్వ దవాఖానాలు.. ప్రైవేటు కంపెనీల పరిధిలో ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించే వర్క్ ప్లేస్ కొవిడ్ సెంటర్లో, వయో వృధులు, దివ్యాంగుల కోసం గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లు, స్కూళ్లు, కళాశాలలు, వృద్ధాశ్రమాల్లో, పంచాయతీ భవనాల్లో తాత్కాలిక ప్రాతిపదిక ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే టీకాలు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.
స్టార్ హోటళ్లలో టీకాలు వేయడం నిబంధనలకు విరుద్ధమని, తక్షణం కార్యక్రమాన్ని నిలిపివేయాలని మార్గదర్శకాల్లో ఆరోగ్యశాఖ కార్యదర్శి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన, పాలనాపరమైన చర్యలు చేపట్టాలన్నారు. మార్గదర్శకాల మేరకు దేశంలో కొవిడ్ టీకా జరిగేలా చూడాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు.