న్యూఢిల్లీ : గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా వైరస్ సోకిన వ్యక్తి దగ్గిన సమయంలో, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు బయటికి వచ్చే తుంపర్ల ద్వారా వ్యాపిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సవరించిన కొవిడ్-19 క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ను బుధవారం విడుదల చేసింది. గత ఏడాది జూన్లో జారీ చేసిన ప్రోటోకాల్కు ఇది పూర్తి భిన్నంగా ఉంది. గత ఏడాది జారీ చేసిన ప్రోటోకాల్స్ జారీ చేసిన సమయంలో ఈ ఇన్ఫెక్షన్ సోకినవారికి సమీపంలో ఉన్నవారికి, ముఖ్యంగా శ్వాస సంబంధిత తుంపర్ల ద్వారా వ్యాపిస్తుందని పేర్కొన్న విషయం విధితమే. వైరస్ సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా, మాట్లాడినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందని చెప్పినప్పటికీ.. గాలి ద్వారా వ్యాపిస్తుందన్న విషయాన్ని చెప్పలేదు.
ఇటీవల ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ కార్యాలయం విడుదల చేసిన మార్గదర్శకాల్లో కరోనా వ్యాప్తి గాలి తుంపర్ల ద్వారా జరుగుతున్నట్లు పేర్కొంది. ఈ వైరస్ సోకిన గాలి తుంపర్లు గాలిలో దాదాపు 10 మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఉటంకిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్లో తెలిపిన వివరాల ప్రకారం.. వైరస్ ప్రధానంగా సమీపంలో ఉండే వ్యక్తుల ద్వారా వ్యాపిస్తున్నట్లు, ముఖ్యంగా మీటర్ పరిధిలో ఉన్నవారి నుంచి వ్యాపిస్తున్నట్లు ప్రస్తుత సాక్ష్యాధారాలు చెబుతున్నాయి. వైరస్ ఉన్న గాలి, నీటి తుంపర్లను పీల్చినవారికి లేదా అవి కళ్లల్లో, ముక్కులో, నోటిలో పడినవారికి.. గాలి, వెలుతురు లేని ప్రదేశాల్లో ఉండేవారికి కూడా ఈ వ్యాధి సోకుతుంది.
గాలి, వెలుతురు ఎక్కువగా ప్రసరించని గదులు వంటివాటిలో ఎక్కువ మంది, చాలా సేపు ఉంటే, వారికి వైరస్ వ్యాపిస్తుంది. గాలి తుంపర్లు ఒకే చోట స్థిరంగా ఉండిపోవడం, ఒక మీటరు కన్నా ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఇటీవల కొవిడ్ ప్రొటోకాల్స్ నుంచి ప్లాస్మా థెరపీని తొలగించిన కేంద్రం.. తాజాగా సవరించిన ప్రోటోకాల్స్లో జాబితాలో ఐవర్మెక్టిన్ను కొత్తగా చేర్చింది. అయితే, గర్భిణులు, బాలింతలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. అధికంగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో స్టెరాయిడ్స్ను వైద్యుడి సలహా మేరకు తీసుకోవాలని సూచించింది.