భువనేశ్వర్ : యాస్ తుఫాను తీరం దిశగా కదులుతున్నది. బుధవారం మధ్యాహ్నం బాలాసోర్కు దగ్గరలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 130-155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భువనేశ్వర్లోని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ధామ్రాకు 40 కిలోమీటర్లు, దిఘాకు 90 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లో బుధవారం ఉదయం నుంచి తీవ్రమైన గాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. ఒడిశాలోని తీర ప్రాంతాల్లో ప్రజలు పరిపాలనకు సహకరించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు.
తుఫాను నేపథ్యంలో బెంగాల్లో 11.5లక్షల మందిని ఇతర ప్రాంతాలకు తరలించినట్లు సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. తుఫాను పరిస్థితిని సమీక్షించేందుకు 26న సచివాయం నబన్నాలో అందుబాటులో ఉంటానని తెలిపారు. ఇదిలా ఉండగా.. మంగళవారం భారీ గాలులతో కురుస్తున్న వర్షానికి హుగ్లీ, ఉత్తర 24 పగరణాలు జిల్లాల్లో 80 ఇండ్లు దెబ్బతిన్నాయి. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రైల్వే సైతం అప్రమత్తమై 38 ట్రయిన్లను రద్దు చేసింది. తుఫానును ఎదుర్కొనేందుకు భారత నావికాదళం సహాయక చర్యలను వేగవంతం చేసింది. రెండు నేవీ డైవింగ్ బృందాలు, అవసరమైన సామగ్రి, పడవలతో ప్రత్యేక సిబ్బందితో కూడిన ఐదు వరద సహాయ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.