బీజింగ్: చైనాలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాజధాని బీజింగ్లో సామూహిక పరీక్షలకు ఆదేశాలు జారీ చేశారు. జనవరి 15 నుండి రాజధాని బీజింగ్లో 39 కోవిడ్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల మిశ్రమంగా కేసులున్నాయి. ఫెంగ్టై జిల్లాలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో హోల్సేల్ మార్కెట్లను మూసివేశారు. కరోనా కేసులున్న అపార్ట్మెంట్ బ్లాక్లను సీల్ చేశారు. సామూహిక కార్యకలాపాలను నిలిపివేశారు.
మరోవైపు చైనాలో ఫిబ్రవరి 4 నుంచి శీతాకాల ఒలింపిక్స్ ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని బీజింగ్లో కరోనా కేసుల పెరుగుదలపై అధికారులు అప్రమత్తమయ్యారు. బీజింగ్లో శనివారం 9 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆరు కేసులు బీజింగ్లోని 16 జిల్లాలలో ఒకటైన ఫెంగ్టై జిల్లాకు చెందినవే. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలోని ప్రజలందరికీ ఆదివారం నుంచి సామూహిక కరోనా టెస్ట్లు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.