న్యూఢిల్లీ, అక్టోబర్ 13: దేశంలో రెండో పెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తన షేర్హోల్డర్లకు పండుగ బొనాంజా ఇస్తున్నది. రూ.9,300 కోట్లతో షేర్ల బైబ్యాక్ను, రూ.6,940 కోట్ల విలువైన మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికానికి ఆర్థిక ఫలితాల్ని పరిగణనలోకి తీసుకునేందుకు సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు బైబ్యాక్, డివిడెండ్ ప్రతిపాదనల్ని ఆమోదించింది. ఒక్కో షేరుకు రూ.1,850 ధర మించకుండా రూ.9,300 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఈ బైబ్యాక్ ధర గురువారం స్టాక్ ఎక్సేంజీలో రూ.1,419 కంటే 30 శాతం అధికం. అలాగే షేరుకు రూ.16.50 చొప్పున మధ్యంతర డివిడెండ్ను చెల్లించనుంది. ఇందుకోసం రూ.6,940 కోట్లు కేటాయించినట్టు కంపెనీ తెలిపింది.
జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికరలాభం 11 శాతం వృద్ధితో రూ.6,021 కోట్లకు చేరింది. ఆదాయం 23.4 శాతం వృద్ధితో రూ.36,538 కోట్లకు పెరిగింది. ఈ పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం గైడెన్స్ను 14-16 శాతం మేర వృద్ధి చెందుతుందని గతంలో గైడెన్స్ ఇవ్వగా దానిని ఇప్పుడు 15-16 శాతానికి సవరించింది. ఆపరేటింగ్ లాభం గైడెన్స్ను సైతం 21-22 శాతానికి పెంచింది.
ఉద్యోగులు ఒకేసారి రెండు కంపెనీల్లో పనిచేయడానికి కంపెనీ మద్దతివ్వదని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ చెప్పారు. మూన్లైటింగ్పై కంపెనీ విధానాన్ని వెల్లడిస్తూ గిగ్స్లో వర్క్చేయడం ఇన్ఫోసిస్కు విరుద్ధంగా వ్యవహరించడమేనన్నారు. అయితే తమ ఉద్యోగులు మెయిన్ ప్రాజెక్ట్లో చేస్తూనే ఇంటర్నల్ ప్రాజెక్టుల్లో ఇంటర్నల్ గిగ్ వర్క్ చేసేందుకు కంపెనీ అనుమతిస్తుందని, ఇందుకోసం ఒక ప్లాట్ఫామ్ను సైతం చాలా ఏండ్ల క్రితమే ఏర్పాటు చేశామని ఇన్ఫోసీసీ ఎండీ వివరించారు. ఇందుకోసం ప్రతీ త్రైమాసికంలో 40,000 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకుంటారని, వేరొక ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు అందులో 600 మందిని ఎంపికచేస్తామని వివరించారు.