అమరావతి : ఏపీలో వైసీపీపై ఎంతో నమ్మకంతో ఓటేసి గెలిపిస్తే ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మాఫియా పేరిట విధ్వంసానికి పాల్పడ్డారని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi ) ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్సభ పరిధిలోని పీలేరు (Pileru) నియోజకవర్గంలో కలికిరిలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. వైసీపీ మంత్రి రౌడీయిజం, భూ మాఫీయా(Mafia), లిక్కర్ మాఫియాకు పాల్పడడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని, ఇటువంటి వారికి చరమగీతం పాడుతామని అన్నారు. ఏపీలో వైసీపీకి కౌంట్ డౌన్(Count down) షురూ అయ్యిందని పేర్కొన్నారు.
వైసీపీ పాలనలో పరిశ్రమలు లేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాలేదని రైతులకు నీళ్లు అందించని పరిస్థితిని తీసుకొచ్చారని ఆరోపించారు. ఏపీలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్(Double Engine Sarkar) వస్తే ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఏపీ జీవన ప్రజల ప్రమాణాలు పెంచుతామని అన్నారు. ఇంటింటికి పైప్లైన్ తాగునీరు అందించాలని కేంద్రం ప్రయత్నిస్తే వైసీపీ దానిని పట్టించుకోలేదని, పోలవరాన్ని గంగలో కలిపారని మండిపడ్డారు.
కూటమి అధికారంలోకి వస్తే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీయే సర్కార్ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తుందని ఇందులో భాగంగా ఎక్స్ప్రెస్వే నిర్మాణాలు చేపట్ట్మాని గుర్తు చేశారు. వచ్చే ఐదేండ్లలో మౌలిక సదుపాయాలు దక్షిణాధి రాష్ట్రాల్లో కూడా బులెట్ ట్రైన్ నడిపిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ గుండా బులెట్ ట్రైన్ కావాలా? వద్దా అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమలో రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ఎన్డీఏతోనే సాధ్యమవుతుందని , కడప, పులివెందులలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతామని పేర్కొన్నారు. మోదీ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అని అన్నారు. ఈ సభలో అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్రెడ్డి, నారాలోకేశ్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.