జమ్మికుంట, జూన్ 7: రాష్ట్రంలోని బీడు భూములన్నీ సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని, మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్రెడ్డి కొనియాడారు. తొమ్మిదేళ్లలో సాగు, తాగు నీటి ఇబ్బందుల్లేకుండా చేసిన కేసీఆర్ తెలంగాణ సాగునీటి సంస్కర్త అని ప్రశంసించారు. దేశానికే ఆదర్శంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని, వాటర్ హబ్లా రాష్ట్రం మారిందని తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ‘సాగునీటి దినోత్సవం’, చెరువుల పండుగపై సమీక్షా సమావేశాన్ని బుధవారం జమ్మికుంటలోని ‘స్వాతి గార్డెన్’లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి మండలి విప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలి విప్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిందన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందేలా చూస్తున్నారని చెప్పారు.
తెలంగాణ పథకాలు దేశానికే దిక్సూచీగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే 2 లక్షల 43వేల పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలైనట్లు పేర్కొన్నారు. ఇందులో లక్షా 55వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత రాష్ట్ర సర్కారుదేనని స్పష్టం చేశారు. డీబీఎంలు, చెక్డ్యాంల ద్వారా లక్షా 15 వేల హెక్టార్లకు సాగు నీరందుతున్నదని చెప్పారు. మిషన్ కాకతీయతో చెరువులు జీవం పోసుకున్నాయని, భూగర్భ జలాలు 5 మీటర్లలో ఉన్నాయని తెలిపారు. రైతు బంధు కింద రూ.523 కోట్లు, రైతు బీమా ద్వారా రూ.840 మంది రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారన్నారు. అన్ని వర్గాలకు రూ.1776 కోట్ల విద్యుత్ సబ్సిడీ అందించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. నియోజకవర్గంలో 42 వేల మందికి పింఛన్లు, 14 వేల మందికి కల్యాణలక్ష్మి, 12వేల మందికి కేసీఆర్ కిట్లు ఇలా చెప్పుకొంటూ పోతే.. పథకాలు అందని ఇళ్లే లేదని చెప్పుకొచ్చారు. జమ్మికుంట, హుజూరాబాద్ జంట నగరాలుగా తీర్చిదిద్దుతున్నామని, కోట్లాది నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గురువారం చెరువుల పండుగను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
గ్రామాల్లోని ప్రతి చెరువు వద్ద పండుగ వాతావరణం ఉండాలన్నారు. గ్రామాల్లో 500 మంది, పట్టణాల్లో 5 వేల మందికి తగ్గకుండా బతుకమ్మలు, బోనాలతో హాజరుకావాలని కోరారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో అభివృద్ధి ఉందా..? అని ప్రశ్నించారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ అభివృద్ధి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని బ్లాక్ మెయిల్ చేస్తున్న బీజేపీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ, రాష్ట్రం కనివినీ ఎరుగని తరహాలో అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. ఈ సమావేశంలో ఈఎన్సీ శంకర్, డీసీసీబీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్, కరీంనగర్ డీసీపీ మహేశ్, హుజూరాబాద్ ఏసీపీ వెంకట్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, హుజూరాబాద్ ఎంపీపీ రాణి, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, ఇరిగేషన్, రెవెన్యూ, అధికారులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, ఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు.