కరీంనగర్: హుజూరాబాద్ ఫలితాలపై కాంగ్రెస్లో రచ్చ నెలకొంది. తెలంగాణలో అవసాన దశలో ఉన్న పార్టీకి పునర్వైభవం తీసుకొస్తానని చెప్పి పగ్గాలు చేపట్టిన రేవంత్రెడ్డి..కాంగ్రెస్ను పూర్తిగా ముంచేస్తున్నాడని ఆ పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. ఇందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికే ప్రత్యక్ష సాక్ష్యమని అంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిస్థాయిలో వెలువడలేదు.. కానీ, ఈ ఎన్నికల్లో ఊహించిన స్థాయిలో ప్రభావాన్ని చూపించలేకపోయిన కాంగ్రెస్లో మాత్రం అప్పుడే రచ్చ మొదలైంది. హుజూరాబాద్లో కేడర్ ఉన్న కాంగ్రెస్కు ఓటు వేయించలేకపోయామని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. దుబ్బాక, నాగార్జునసాగర్లో పనిచేసినట్లు హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదన్నారు. ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 5 నెలలు అయినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని కోమటిరెడ్డి అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ ఒక్క సభ కూడా పెట్టలేదని మండిపడ్డారు. కాంగ్రెస్కు హుజూరాబాద్లో గట్టి కేడర్ ఉందని, అయినా తమవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ ప్రయత్నం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. హుజూరాబాద్పై వాస్తవ పరిస్థితిని హైకమాండ్కు వివరిస్తానని కోమటిరెడ్డి స్పష్టంచేశారు.
ఇదిలా ఉండగా, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై మరో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా మండిపడ్డారు. హుజూరాబాద్లో రేవంత్రెడ్డి, బట్టి విక్రమార్క వల్లే బల్మూరి వెంకట్ బలిపశువు అయ్యారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలోకి నేతలు వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు కానీ.. ఓటుబ్యాంకు మారదన్నారు. రేవంత్రెడ్డి వల్లే హుజూరాబాద్లో కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడిపోయిందని మండిపడ్డారు. హుజూరాబాద్లో డిపాజిట్ వస్తే రేవంత్ ఖాతాలో.. డిపాజిట్ గల్లంతైతే కాంగ్రెస్ ఖాతాలో వేసేందుకు రేవంత్రెడ్డి అనుచరులు సిద్ధంగా ఉన్నారన్నారు.
రేవంత్రెడ్డికి పొన్నం ప్రభాకర్ చురకలు..
కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హుజూరాబాద్ ఫలితాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అటు మాజీ.. ఇటు తాజా పీసీసీ చీఫ్లపై ఆయన తనదైన శైలిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవానికి మాజీ పీసీసీ ప్రెసిడెంట్, తాజా ప్రెసిడెంట్లే కారణమంటూ మండిపడ్డారు. ఇప్పుడు కూడా ఊరికే బహిరంగ సభలు పెడితే కుదరదని రేవంత్రెడ్డికి పరోక్షంగా చురకులు అంటించారు. ఈ విషయంపై అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం కూడా ఆలోచించుకోవాలన్నారు. కాగా, హుజూరాబాద్ ఫలితాలపై సీనియర్ నేతల విమర్శలతో కాంగ్రెస్లో రచ్చ నెలకొంది. రేవంత్రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పజెప్పడం తమకేమాత్రం ఇష్టం లేదనే విషయాన్ని సీనియర్లు ఇప్పుడు పరోక్షంగా చెప్పేయడం చర్చనీయాంశమైంది.