మహబూబ్నగర్ : కాంగ్రెస్ (Congress) పార్టీని రాజకీయంగా ఉరి తీసే సమయం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Former Minister Niranjan Reddy) అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వాడిన భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్పై ( KCR ) చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పాలనలోనే పాలమూరును వలసల పాలు చేసిందని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో పాలమూరు నుంచి తిరిగి వలసలు
కాంగ్రెస్ అంటే పెండింగ్.. కేసీఆర్ అంటే రన్నింగ్ అని అభివర్ణించారు. బీఆర్ఎస్( BRS ) పదేళ్లలో పాలనలో ఉపాధి కోసం పాలమూరుకు వలసలు వచ్చేలా చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. 19 నెలల కాంగ్రెస్ పాలనలో పాలమూరు నుంచి తిరిగి వలసలు మొదలయ్యాయని దుయ్యబట్టారు. 2014 వరకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నీళ్లు అందింది 13 వేల ఎకరాలకు మాత్రమేనని తెలిపారు. భీమా , నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించింది కేసీఆర్ అని గుర్తు చేశారు.
జూరాల చివరి ఆయకట్టుకు, కల్వకుర్తి ఎత్తిపోతల కింద దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని అన్నారు. 90 శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను 19 నెలలుగా పడావు పెట్టి,పూర్తయిన టెండర్లను రద్దు చేసి వందల కోట్ల అదనపు భారం మోపుతుందని విమర్శించారు.కాంగ్రెస్ నిర్లక్ష్యం మూలంగా వట్టెం పంప్ హౌస్ నీట మునిగితే దానిని పట్టించుకున్న పాపాన పోలేదని పేర్కొన్నారు.
పాలమూరు బిడ్డ ఎందుకు సమీక్ష చేయలేదు
పాలమూరు బిడ్డను చెప్పుకుంటున్న రేవంత్ గత 19 నెలల్లో తట్టెడు మన్ను ఎత్తిన పాపాన పోలేదని ఆరోపించారు. ఒక్కసారి కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల పై సమీక్ష చేయలేదని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తన మామ స్వర్గీయ జైపాల్ రెడ్డి పేరు పెట్టుకున్నందుకైనా పనులు వేగవంతం అవుతాయని అనుకున్నాం . పేరు పెట్టి ఏడు నెలలు కావస్తున్నా పనుల్లో పురోగతి లేదు..రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి . కాళ్లు తంగెళ్లు దాటడం లేదు.రేవంత్ నాయకత్వంలో పాలమూరుకు మేలు జరగడం సంగతి తర్వాత .. కీడు చేయకుంటే అదే పదివేలని నిరంజన్ రెడ్డి అన్నారు.మే నెలలో కృష్ణా నదికి వరద మొదలైనా కల్వకుర్తి ఎత్తిపోతల మోటార్లు ఆన్ చేయకుండా 45 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించిందని మండిపడ్డారు.
కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం
కేసీఆర్, ఆయన కుటుంబం గురించి రేవంత్ అనుచిత వ్యాఖ్యలు గర్హనీయమని అన్నారు.రాజకీయాల్లో హత్యలుండవ్.. ఆత్మహత్యలే ఉంటాయి.అభివృద్ధి చేసేందుకు వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని రేవంత్ రెడ్డి తన చర్యలను వ్యతిరేకించిన వారి మీద పగ తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటున్నాడని ఆరోపించారు.రాజకీయాల్లో ఎందరో నియంతలు నేలకూలారు. వారి సరసన భవిష్యత్తులో రేవంత్ చేరడం ఖాయమని జోస్యం చెప్పారు.ప్రభుత్వ అధికారిక సభలను రాజకీయ సభలుగా మార్చి ప్రతిపక్ష నేత మీద చావు భాష ప్రయోగిస్తున్న ఏకైక సీఎం రేవంతని ఆగ్రహం వ్యక్తం చేశారు.