చెన్నై : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. జాతీయ పతాకం చేబూని తొలి అడుగు వేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్, చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ భాఘేల్ సహా పలువురు నేతల సమక్షంలో గాంధీ మంటపం నుంచి పాదయాత్ర ప్రారంభించారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 150 రోజుల పాటు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. నరేంద్ర మోదీ వైఫల్యాలను ఎండగడుతూ భావసారూప్యం కలిగిన శక్తులతో చేయిచేయి కలుపుతూ 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది. మిలే కదం…జుడే వతన్ నినాదంతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
రాహుల్ వెంట పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో కూడిన 117 మంది బృందం పాదయాత్రలో పాలుపంచుకుంటుంది. ఇక పాదయాత్ర ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ కన్యాకుమారిలోని వివేకానంద మెమోరియల్ను సందర్శించారు. మరోవైపు శ్రీపెరంబదూర్లో ఉన్న మాజీ ప్రధాని రాజీవ్గాంధీ స్మారకం వద్ద నివాళి అర్పించారు. విద్వేష, విభజన రాజకీయాలకు తన తండ్రి బలయ్యాడని, కానీ అటువంటి విద్వేష రాజకీయాలకు దేశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేనని రాహుల్ ఇవాళ ట్విట్టర్లో తెలిపారు