మేడ్చల్, నవంబర్ 5 : ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను క్లీన్ బౌల్డ్ చేస్తామని, డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తామని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్నగర్, ఘట్కేసర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ, రోడ్ షోలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్నగర్లను రాత్రింభవళ్లు కష్టపడి అభివృద్ధి చేశామని, అందుకే ఓట్లు అడుగుతున్నామన్నారు. శ్మశానవాటిక, రోడ్లు, డంపింగ్యార్డులు, తదితర వాటిని బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందన్నారు. ఒక్క బీఆర్ఎస్కే ఓట్లు అడిగే హక్కు ఉందని, కాంగ్రెస్ ఏమి చేసిందని ఓట్లు అడుగడానికి వస్తున్నారని ప్రశ్నించారు. మేడ్చల్ ప్రజల ఓట్లతో ఎంపీగా గెలిచిన రేవంత్ నాలుగేండ్లలో ఒక్కసారి కూడా ప్రజలకు ఎక్కడా కన్పించలేదన్నారు. వజ్రేశ్ యాదవ్, ప్యాకేజీ మాస్టర్లు కాంగ్రెస్ గెలుస్తుందని అంటున్నారని, ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.
ఇంకా ఎన్నికలు జరిగేలోపు ఇంకా రెండు షోలు ఉన్నాయని, వాటితో కాంగ్రెస్ మైండ్ బ్లాక్ కావడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేసి, గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంత మంది ప్యాకేజీ మాస్టర్లు కాంగ్రెస్లో చేరినా బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరన్నారు. అవాకులు, చెవాకులు పేలి, ఆపద మొక్కులు మొక్కి గెలుస్తామని అనుకుంటున్నారని విమర్శించారు. వారిని తరిమి కొట్టాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బోడుప్పల్లో జరిగిన కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, బోడుప్పల్ కార్పొరేషన్ అధ్యక్షుడు మంద సంజీవ రెడ్డి, జవహర్నగర్లో జరిగిన కార్యక్రమంలో మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేషన్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, పీర్జాదిగూడ కార్యక్రమంలో మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో తెలంగాణ నంబర్వన్: హోం మంత్రి
సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే నం.1గా నిలిచిందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం రాత్రి ఘట్కేసర్లో పది వేల మందితో బీఆర్ఎస్ ఆశీర్వాద సభ మున్సిపాలిటీ చైర్పర్సన్ పావనీ జంగయ్య యాదవ్, బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి, మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సీఎం కేసీఆర్ చేపడుతున్నారని తెలిపారు. దీంతో దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు సీఎం కేసీఆర్ను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు.