స్టేషన్ఘన్పూర్, మే18 : వారు విధి వంచితులు.. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు వారి వి. కూలికి పోతేనే నాలుగు మెతుకులు..లేకుంటే పస్తులే అన్నట్లుగా వారి జీవనం సాగుతున్నది. కాయ కష్టం చేసి కుటుంబాలను పోషించుకుంటూ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వారి జీవితాలను విధి వక్రీకరించింది. పక్షవాతంతో ఇంటి పెద్దలు మంచానికే పరిమితం కాగా, వారి భార్యలు కూలీనాలి పనులు చేసుకుంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. వికలాంగుల పింఛన్ వస్తే మందులకైనా పని చేస్తాయని పింఛన్ కోసం దరఖాస్తు చేసుకొని నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారు జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడం గ్రామానికి చెందిన మేకల వెంకటయ్య, ఉప్పలమ్మ, గంగారపు రమ, రమేశ్ దంపతులు. మేకల వెంకటయ్య, ఉప్పలమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతు రు ఉన్నారు.
మేకలు సాకడమే వృత్తిగా ఉన్న వీరు పదేళ్ల క్రితమే పిల్లల పెండ్లిళ్లు చేయగా, వారు హైదరాబాద్లో కూలీ పనులు చేసుకుంటూ అక్కడే ఉం టున్నారు. నాలుగేళ్ల క్రితం వెంకటయ్యకు పక్షవా తం రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. అతడి భార్య ఉప్పలమ్మ కూలీ పనులు చేసుకుం టూ భర్తను పోషించుకుంటున్నది. రెండేళ్లుగా ఉప్పలమ్మ కూడా నడుంనొప్పి రావడంతో కూలీ పనులకు వెళ్లే పరిస్థితి లేక కుటుంబ పోషణ భారంగా మారింది. వీరి మంచి చెడులను చూసే ఆర్థిక స్థోమత పిల్లలకు లేకపోవడంతో వారు బతకడం భారంగా మారింది. ప్రభుత్వం ఇచ్చే దివ్యాంగుల పింఛన్ వస్తే మందులకైనా పని చేస్తాయని నాలుగుసార్లు దరఖాస్తు చేసినా పింఛన్ రావడం లేదని, ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని ఆ దంపతులు తెలిపారు. సదరం సర్టిఫికెట్ల గడువు ముగుస్తుంది.. కానీ గడపలోకి పథకాలు రావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మా ఆయన నాలుగేండ్ల క్రితం పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమైండు. ఇంట్లకు ఎల్లక నానా కష్టాలు పడుతున్నాం. పింఛన్ కోసం దరఖాస్తు చేయడానికి సదరం సర్టిఫికెట్ల కోసం ఆటోలో జనగామకు నాలుగు సార్లు పోతే రూ.4వేల వరకు ఖర్చయింది. నాలుగుసార్లు దరఖాస్తు చేసినా ఇప్పటి వరకు పింఛన్ మంజూరు కాలేదు. మా ఆయనకు మందులకు నెలకు రూ.5వేల వరకు ఖర్చవుతున్నయి. ఇటు మందులకు, అటు తిండికి ఇబ్బంది పడుతున్నం. నాకు నడుం నొప్పి ఉండడంతో కూలి పనులు చేయలేకపోతున్న. ఉన్న చిన్న ఇల్లు కూడా కూలిపోవడంతో కిరాయికి ఉంటున్నం. మొదట మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశాక, మళ్లీ రద్దు చేశారు. ప్రభుత్వం స్పందించి పెన్షన్ అందించి ఆదుకోవాలి, లేకుంటే మాకు చావే గతి.
– ఉప్పలమ్మ, మేకల వెంకటయ్య భార్య