న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆ పార్టీ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఖాతాను లాక్ చేసిన ట్విట్టర్ తాజాగా.. మరో ఐదుగురు నేతలకు చెందిన అకౌంట్లను నిలిపివేసింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత ప్రణవ్ ఝా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇందులో పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అజయ్ మాకెన్, లోక్సభలో ఆ పార్టీ విప్ మాణిక్కం ఠాగూర్, అసోం ఇన్చార్జి, మాజీ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితాదేవ్ ఖాతాలు లాక్ అయ్యాయని పార్టీ సమాచార విభాగం ఇన్చార్జి తెలిపారు.
అయితే, ఈ జాబితా మరింత పెరగొచ్చని పేర్కొన్నారు. పార్టీ నేతల ట్విట్టర్ ఖాతాలను నిలిపివేయడంపై కాంగ్రెస్ మండిపడుతోంది. నిరసన తెలపడాన్ని, ప్రతి ఒక్కరి కోసం పోరాటం చేయడాన్ని తప్పుగా చూస్తున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం తాము చేసే పోరాటాన్ని ఇలాంటి చర్యల ద్వారా ఆపొచ్చని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారని విమర్శించింది. కాగా, ఢిల్లీలో దళిత బాలిక హత్యాచారం కేసులో.. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలు బయటకు తెలిసేలా ట్వీట్ చేశారని, ఈ మేరకు రాహుల్ ఖాతాను లాక్ చేస్తున్నట్లు ట్విట్టర్ పేర్కొంది.