సిద్దిపేట : కాంగ్రెస్లో మరోసారి వర్గబేధాలు భగ్గుమన్నాయి. జిల్లాలోని ధూళ్మిట్ట మండలం కూటిగల్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చేపట్టిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. వరంగల్ డిక్లరేషన్ పేరిట గత కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జనగామ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్నారు.
దీనిని సహించని మాజీ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వర్గీయులు ప్రతాప్ రెడ్డి పర్యటనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ మద్దూరు మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతాప్ రెడ్డి పర్యటన అడ్డుకొని ఆయన కారు పైన రాళ్లతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.
కాగా కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజవర్గంలో రెండు వర్గాలుగా చీలిపోయి బాహాటంగానే భౌతిక దాడులకు దిగడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తామే అధికారంలోకి వస్తామని చెప్పే కాంగ్రెస్ నాయకులలోనే ఐక్యత లోపించడం కాంగ్రెస్ అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారింది.