న్యూఢిల్లీ : రాష్ట్ర అసెంబ్లీ నుంచి మాజీ ప్రధాని, దివంగత నేత జవహర్లాల్ నెహ్రూ ఫొటోను బీజేపీ తొలగించిందని కాంగ్రెస్ ఆరోపించడంతో మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) రాజకీయ వాతావరణం వేడెక్కింది. నెహ్రూ ఫొటోను అసెంబ్లీ నుంచి తొలగించడం సరైంది కాదని మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కుమారుడు, కాంగ్రెస్ నేత జైవర్ధన్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
తాను ఈ విషయంపై ప్రొటెం స్పీకర్ గోపాల్ భార్గవతో చర్చిస్తానని చెప్పారు. సభ నుంచి జవహర్లాల్ నెహ్రూ ఫొటో తొలగించడం విచారకరమని, నెహ్రూ వలనే మన దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉందని, అలాంటి నేత ఫొటోను సభ నుంచి తొలగించడం బాధాకరమని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ నేతలు బీఆర్ అంబేడ్కర్ ఫొటో తొలగించి ఆ స్ధానంలో నాథూరాం గాడ్సే ఫొటోను పెడతారని విపక్ష నేత ఉమంగ్ సింఘర్ ఆరోపించారు.
నెహ్రూ ఫొటోను తొలగించడం ప్రధానం కాదని, కానీ నెహ్రూ ఆలోచనలను నిర్మూలించాలనే కాషాయ నేతల ఆలోచనే ప్రమాదకరమని అన్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలోనే ఇదంతా జరిగిందని, దీనిపై తాను ఎలాంటి సూచనలు చేయలేదని ఈ వివాదంపై స్పందిస్తూ ప్రొటెం స్పీకర్ గోపాల్ భార్గవ వివరణ ఇచ్చారు.
Read More :