కష్టాలతో ‘సాగు’తున్న అన్నదాతలపై మరో పిడుగు పడింది. రసాయన ఎరువుల ధరల పెంపుతో మరింత భారం పడనుంది. సర్కారు నిర్లక్ష్యంతో వడ్లు, మక్కలు, జొన్నలు అమ్ముకోలేక, అకాల వర్షాల నుంచి పంటలను కాపాడుకోలేక రైతులు ఇప్పటికే సతమతమవుతున్నారు. ఇదే సమయంలో కోటి ఆశలతో వానాకాలం సాగుకు సమాయాత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఎరువులపై ధరల మోత మోగించింది. ఫలితంగా ఒక్కో బస్తాపై రూ.150 నుంచి రూ.400 దాకా బాదడంతో రైతులపై పెనుభారం పడనుంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని డీలర్లు చెబుతుండడం అన్నదాతలను కలవరపాటుకు గురి చేస్తున్నది.
నిజాంసాగర్, మే 19: వానకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎరువులపై ధరల మోత మోగించింది. ఒక్కో బస్తాపై రూ.150 నుంచి రూ.400 వరకు పెంచేసింది. ఇప్పటికే పెరిగిన ధరలు అమల్లోకి రాగా, త్వరలో మరోసారి వడ్డన తప్పదని డీలర్లు చెబుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. యాసంగి సీజన్ పూర్తి కాకముందే ఎరువుల కంపెనీలు ధరలు పెంచేశాయి. ఇప్పటికే సమస్యలతో సతమతమవుతున్న అన్నదాతలకు ఇది మరింత ఇబ్బందికరంగా మారింది. ఓవైపు ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరుగక పోవడం, జొన్నల కొనుగోళ్లు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం, మక్కలు కొనేవాళ్లు దిక్కులేక పోవడంతో రైతులు తీవ్రంగా సతమతమవున్నారు. మరోవైపు అకాల వర్షాలు వెంటాడుతుండడంతో వారి కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ఈ నేపథ్యంలో ఎరువుల ధరల భారం మీద పడడంతో అన్నదాత ఆగమవుతున్నాడు.
ఏడాదిలో నాలుగుసార్లు మోత..
ఎరువుల కంపెనీలు ఇష్టానుసారం ధరల మోత మోగిస్తున్నాయి. గత వానకాలం సీజన్ నుంచి ఇప్పటివరకు.. ఏడాది కాలంలో కాంప్లెక్స్ ఎరువుల ధరలను ఏకంగా నాలుగు సార్లు పెంచాయి. వివిధ రకాల ఎరువుల బట్టి బస్తాపై రూ.150 నుంచి రూ.400 వరకు పెరిగాయి. అంతేకాదు, అంతర్జాతీయ సంక్షోభాలు, సరఫరా సమస్యల కారణంగా మరోసారి పెంచేందుకూ సన్నాహాలు చేస్తున్నాయి. వారం, పది రోజుల్లో బస్తాపై అదనంగా రూ.150 నుంచి రూ.300 వరకు పెరిగే అవకాశముందని ఫర్టిలైజర్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు.

1.60 వేల మెట్రిక్ టన్నుల వినియోగం
ఉమ్మడి జిల్లాలో యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను రైతులు ఎక్కువగా వినియోగిస్తారు. కాంప్లెక్స్ ఎరువులతోపాటు పొటాష్ ధరలు సైతం గణనీయంగా పెరగడంతో వచ్చే వానకాలం సీజన్ నుంచి రైతన్నలపై పెట్టుబడి భారం అధికం కానుంది. ఉమ్మడి జిల్లాలో చెరువులు, ప్రాజెక్టులు, బోర్ల ఆధారంగా దాదాపు 8 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. వరి, పత్తి, మక్క, సోయా, మినుము, పసుపు, పెసర వంటి పంటలు వేస్తారు. వాటి సాగు కోసం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి సుమారు 1.60 వేల ఎకరాల మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులు కొనుగోలు చేస్తారు. తొలకరి పలుకరించేలోపు అవసరమైన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేద్దామనుకుంటున్న రైతులకు పెరిగిన ధరలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక వైపు యూరియా కష్టాలు, మరోవైపు అడ్డగోలుగా పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలతో వానకాలం సాగు రైతులకు కత్తిమీద సామూలా మారనుంది.
ధరలు పెంచడం దారుణం
రెండేండ్లుగా యూరియా సక్రమంగా దొరకడం లేదు. యాప్లో బుకింగ్ చేసేలోపు స్టాక్ అయిపోతుంది. ఇప్పుడేమో కాంప్లెక్స్ ఎరువులు ఏకంగా రూ.400 దాకా పెంచారు. ఒకేసారి ఇంత భారీగా పెంచడం దారుణం. డీజిల్ ధర పెంచడం వల్ల ట్రాక్టర్లు, హార్వేస్టర్ల కిరాయి కూడా పెరుగుతుంది. ధరల పెరుగుదలతో కూలీల రేట్లు పెరుగుతాయి. రైతులకు పెట్టుబడి పెరిగి, గిట్టుబాటు కాకుండా పోతుంది. చివరకు అప్పులే మిగులతాయి.
భారం పడకుండా చూడాలి
ఎరువుల ధరలు పెరిగాయని ఫర్టిలైజర్ షాప్ వాళ్లు చెబుతున్నారు. ఇప్పటికే యాసంగి పంటలను అమ్ముకునేందుకు అష్టాకష్టాలు పడుతున్నాం. ఎరువుల ధరలు పెంచితే మరిన్ని ఇక్కట్లు తప్పవు. ప్రతి పంటకు కాంప్లెక్స్ ధరలు ఇలా పెంచుకుంటూ పోతే పెట్టుబడి తడిసి మోపెడవుతున్నది. చివరకు రైతు చేతికి చిల్లిగవ్వ మిగిలే పరిస్థితి లేదు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పెంచిన ధరలను తగ్గించాలి.
– సాయిలు, రైతు, అచ్చంపేట
ఇలా పెంచుతూ పోతే ఎలా?
ఏటా ఎరువుల ధరలు రెండు, మూడు సార్లు పెంచుకుంటూ పోతున్నారు. ఇట్లాగైతే రైతుల పరిస్థితి ఏమౌతుంది. విత్తనాలు, ఎరువుల ధరలు పెంచి ఇబ్బంది పెడుతున్నారు. పండించిన పంటను అమ్ముకోవడానికి సతాయిస్తున్నారు. ఇక, రైతుబంధు కూడా సక్రమంగా ఇస్తలేరు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎట్లా బతకాలి. ప్రభుత్వాల వల్ల మాలాంటి వాళ్లకు వ్యవసాయం మీద ఉన్న మక్కువ కూడా చచ్చిపోతుంది. ఇకనైనా ప్రభుత్వాలు మారాలి.
– శశికాంత్, రైతు, చిన్నకొడప్గల్
