హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన ధూంధాం కార్యక్రమంలో గెల్లు శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. పేదింటి బిడ్డనైన నాకు ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్టిచ్చి ఇక్కడికి పంపిండని, మీ ఆశీర్వాదం కోసం వచ్చానని అన్నారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా ఈటల ఉండి అభివృద్ధి ఏమీ చేయలేదన్నారు. జమ్మికుంటల వానలు పడితే కాలనీలు మునిగి పోతున్నాయని, మునిగే కాలనీలను పట్టించుకోని ఈటల, రేపు గెలిచి ఎవ్వరిని ఉద్ధరిస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మికుంటకు మాస్టర్ ప్లాన్ తెస్తానని, ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూస్తానని హామీ ఇచ్పారు. రూ.వంద కోట్లు తెస్తానని తెలిపారు. వ్యాపార రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానన్నారు. రోడ్లు, మురికి కాల్వలు కట్టిస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.43కోట్లను సీఎం అందించిన విషయాన్ని గుర్తు చేశారు.
నాయిని చెరువును పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తానని చెప్పారు. విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్, అధునాత లైబ్రరీని ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. మెడికల్ కాలేజీని తెప్పించేందుకు సీఎంను కోరుతానని స్పష్టం చేశారు. ఐదు వేల డబుల్ బెడ్రూం ఇండ్లను తెస్తానని పేర్కొన్నారు. సొంత జాగలున్నోళ్లకు రూ.5లక్షలు అందిస్తానని తెలిపారు. వంద కోట్ల అధిపతి ఈటల ఒక్కడేం చేయలేడని అన్నారు.
కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, కోరుకంటి చందర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, పలు వార్డులకు చెందిన ప్రజలు, తదితరులు భారీ సంఖ్యలో హాజరుకాగా, ధూంధాం కళాకారుడు సాయిచంద్ ఆట, పాటలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.