హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ)/రవీంద్రభారతి: ప్రజాకవి కాళోజీ నారాయణరావు బతుకంతా తెలంగాణకు అంకితంచేసిన మహనీయుడని పర్యాటక, సాంస్కృతికశాఖల మం త్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కాళోజీ 19వ వర్ధంతి సందర్భంగా శనివారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. నిజాం దమననీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా కలం ఎత్తిన గొప్ప యోధుడు కాళోజీ అన్నారు. తెలంగాణ ఉద్యమ నిర్మాత, ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళోజీ రచనలు, కవిత్వం అంటే ఎంతో అభిమానమని తెలిపారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. వరంగల్లోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి, హనుమకొండలో నిర్మిస్తున్న కళాక్షేత్రానికి కాళోజీ పేరు పెట్టినట్టు తెలిపారు. ఈ సందర్బంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, ప్రొఫెసర్ మనోజ, మహబూబ్నగర్ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.