భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా-2026ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అంకిత్ సోమవారం విడుదల చేశారు. జిల్లాలోని మొత్తం 1,127 పోలింగ్ కేంద్రాల్లో ప్రజల పరిశీలన కోసం జాబితాను ప్రచురించినట్లు తెలిపారు. ఎలక్ట్రోరల్, అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల కార్యాలయాల పరిధిలో కూడా జాబితా అందుబాటులో ఉంటుందన్నారు.
జిల్లాలోని 27 మండలాల్లో 8,63, 413 మంది సాధారణ ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. వీరిలో 4,19,558 మంది పురుషులు, 4,43,805 మంది మహిళలు, 50మంది థర్డ్జెండర్లు ఉన్నారని పేర్కొన్నారు. అదేవిధంగా 28మంది ఎన్ఆర్ఐలు, 723మంది సర్వీస్ ఓటర్లు నమోదయ్యారని, అన్ని కేటగిరిలను కలిపి జిల్లాలో మొత్తం 8,64,164 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. పినపాక నియోజకవర్గంలో 1,74,854 మంది, ఇల్లెందు 1,94,860, కొత్తగూడెం 2,15,639, అశ్వారావుపేట 1,44,770, భద్రాచలం 1,33,290 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.