హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఖ్యాతి విశ్వ వ్యాప్తం అయిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలుగు వాళ్లమంతా ఒక చోట కలవడం ఆనందంగా ఉంది. ఎక్కడ ఉన్నా మనమంతా ఒక్కటే అని చాటే గొప్ప సందర్భం ఆట మహాసభల ద్వారా సాధ్యమైందన్నారు.
అమెరికా వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలకు మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్ రెడ్డి, మల్లా రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, రవీంద్ర కుమార్, చంటి క్రాంతి కిరణ్, గాదరి కిషోర్కుమార్, టీఎస్ ఐఐసీ చైర్మన్ గాదరి బాలమల్లు, తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..మనం ఎక్కడ ఉన్నా మన దేశ భక్తిని, కన్నతల్లిని, పుట్టిన ఊరిని మరచిపోకుండా ఆటా ఆధ్వర్యంలో మహాసభలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు.
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా దేశాభివృద్ధిలో మన వంతు భాగస్వామ్యం అందిస్తూ మనమే ముందున్నామని మంత్రి తెలిపారు. ఏ పని చేసినా ఎక్కడ ఉన్నా మన యాస,భాష, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని మంత్రి సూచించారు.