హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ ఉద్యమ తరహాలో మహోధృత ఉద్యమాన్ని నిర్మిద్దామని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పంజాబ్లో మాదిరిగా రాష్ట్రంలో రైతులు పండించే రెండు పంటల వడ్లు శాశ్వతంగా కొనుగోలు చేసే దాకా అవిశ్రాంత పోరాటాలకు సిద్ధంకావాలని సూచించారు. ఉద్యమాన్ని నాలుగు దశలుగా నిర్మిద్దామని చెప్పారు. సోమవారం తెలంగాణభవన్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్, నగర పాలక సంస్థ అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యుల సంయుక్త సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉదయం 12 గంటలకు ప్రారంభమైన సమావేశంలో యాసంగి వడ్ల కొనుగోలు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవటానికి అనుసరించాల్సిన పద్ధతులు, రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న పరిస్థితులు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.15 గంటల వరకు దాదాపు గంట పదిహేను నిమిషాల పాటు కేసీఆర్ పార్టీ శ్రేణులకు సమావేశ ఎజెండా, పార్టీ వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అక్కడే ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు.
అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమావేశం కొనసాగింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై సీఎం కేసీఆర్ పార్టీ నేతల అభిప్రాయాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఎంపీ మాలోతు కవిత, విజయ డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, గొర్రెలు, మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుతో పాటు దాదాపు 15 మంది నాయకులు అభిప్రాయాలను వెల్లడించినట్టు సమాచారం. మరికొంతమంది నాయకులు తమ అభిప్రాయాలను చీటీల మీద రాసి సీఎం కేసీఆర్కు పంపించినట్టు తెలిసింది.
అందరి అభిప్రాయాలు విన్న తరువాత రైతు ఉద్యమ కార్యాచరణను త్వరలో వెల్లడిస్తామని, ఈలోపు అన్నిస్థాయిల్లో పార్టీని, ప్రజలను సన్నద్ధం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ముందుగా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కేంద్రమంత్రి పియూష్ గోయల్ను కలిసి యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని కోరతారని చెప్పారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన రానిపక్షంలో పార్టీ, ప్రభుత్వం రైతులకు బాసటగా నిలవాలని, భారీ ఉద్యమాన్ని నిర్మిద్దామని అన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వరి రైతులకు అండగా ఉండేందుకు టీఆర్ఎస్ ఎంతవరకైనా పోరాటం చేస్తుందనే ధీమా కల్పించాలని దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 2 తరువాత నిరసన దీక్షలు చేపట్టాలని, నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించి పార్టీ ఎప్పుడు పిలుపు ఇస్తే అప్పుడు సిద్ధంగా ఉండాలని చెప్పినట్టు సమాచారం. అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులకు సెమినార్లు, సదస్సులు నిర్వహించాలని సూచించినట్టు సమాచారం.
కులవృత్తుల వారితో సహపంక్తి భోజనాలు చేయాలి
అభివృద్ధి.. అభ్యుదయం ఇదే తమ విధానం అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకం కావాలని, వారి కష్టసుఖాల్లో భాగం పంచుకోవాలని ఉద్బోధించారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని అన్ని వృత్తులవారితో కలిసి సహపంక్తి భోజనాలు చేయాలని సూచించినట్టు సమాచారం. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటే జీవితకాలం తృప్తి ఉంటుందని, అందుకోసం నాయకులు పాటుపడాలని సీఎం హితబోధ చేసినట్టు తెలుస్తున్నది. ‘అనేక దశాబ్దాలు పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించుకున్నాం. ఏడున్నర ఏండ్లుగా రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నాం. రోడ్లు వేస్తేనే అభివృద్ధి కాదు ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు రావాలి. అందుకోసమే అభ్యుదయ పంథాలో దళితబంధు పథకాన్ని తెచ్చాం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచా రం. ‘95 శాతం ఉద్యోగాలు స్ధానికులకే దక్కాలని జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థను రూపొందించుకున్నాం. త్వరలోనే మన పిల్లలకు ఉద్యోగాలు రాబోతున్నాయి. కొన్ని ప్రతీపశక్తులు పనిగట్టుకొని నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తాయి. వీటిని అర్థమయ్యేరీతిలో తిప్పికొట్టాలి’ అని సీఎం సూచించినట్టు సమాచారం.
తీర్మానాలతో కేంద్రంపై ఒత్తిడి పెంచాలి
ధాన్యం కొనుగోలుకు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు, డీసీసీబీలు, డీసీఎంఎస్ పాలక మండళ్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి పంపాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆ తరువాత గ్రామ గ్రామాన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని, అప్పటికీ కేంద్ర వైఖరిలో మార్పు రాకపోతే, మంత్రివర్గ సభ్యులందరూ ఢిల్లీలో నిరసన కార్యక్రమం నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ ఉద్యమంలో రాష్ట్రంలోని ప్రతి రైతును భాగస్వామ్యం చేయాలని, ప్రతి రైతు ఇంటిపై నల్లజెండాలు ఎగురవేసేలా సమాయత్త పరచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యేలు నియోజకవర్గానికో కేసీఆర్ కావాలె
ఎమ్మెల్యేలు నియోజకవర్గానికో కేసీఆర్లా తయా రు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొనట్టు సమాచారం. ‘ఎమ్మెల్యేలు అందరూ ఏమేమి చేస్తున్నారు? వారి పరిస్థితి ఏమిటి? మొత్తం చిట్టా నా వద్ద ఉన్నది. మాకు కేసీఆర్ ఉన్నడు. మేమెట్లా చేసినా అన్నీ ఆయనే చూసుకుంటాడు అనే ధోరణి మారాలి. ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేయాలి. ప్రజల మన్నన పొందాలి’ అని ఆయన ఒక దశలో కొద్దిగా కఠువుగానే పేర్కొనట్టు తెలిసింది.
28న యాదాద్రికి రండి
పార్టీ ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు సహ అందరూ ఈ నెల 28న యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.