భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 29 : తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ దశలవారీగా అందరి సమస్యలు పరిష్కరిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జిల్లా ఆశ కార్యకర్తల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని రంగాల ప్రజలకు న్యాయం చేస్తూ దేశంలోనే నంబర్ వన్ సీఎంగా కేసీఆర్ నిలుస్తున్నాడన్నారు.
తెలంగాణ చిన్న రాష్ట్రమైనప్పటికీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రగతిని చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉందో పరిశీలించాలన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఆశల పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్రంలో ఎలా ఉందో ఆలోచించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ఆశల సమస్యలు ప్రభుత్వం దశల వారీగా పరిష్కరిస్తున్నదన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక దశల వారీగా వేతనాలు పెంచుతుందన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, ఆశ యూనియన్ రాష్ట్ర ఇన్చార్జి బి.శివశంకర్, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.