మాదక ద్రవ్యాల వినియోగంలో దోషులుగా తేలినవారు ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాలి. కఠిన చర్యల అమలుకై ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వెయ్యి మందితో కూడిన ప్రత్యేక ‘నారోటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్’ (కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్) పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఈ ప్రత్యేక విభాగం రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో, డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక విధులను నిర్వర్తిస్తుంది. – ముఖ్యమంత్రి కేచంద్రశేఖర్రావు
హైదరాబాద్, జనవరి 26: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మాట కూడా వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ వినియోగంలో దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని, కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. డ్రగ్స్ నియంత్రణ చర్యలు చేపట్టే దిశగా ఈ నెల 28న ప్రగతిభవన్లో ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’ జరుపాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న ఈ సదస్సులో రాష్ట్ర హోం, ఎక్సైజ్ శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, డీజీలు, అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీ అధికారులతోపాటు, ఎక్సైజ్ శాఖకు చెందిన ఎస్పీలు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. మాదక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ, విధివిధానాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. ఈ కార్యాచరణకు అనుగుణంగా పోలీస్, ఎక్సైజ్ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించే దిశగా చేపట్టాల్సిన కఠిన చర్యలపై బుధవారం ప్రగతిభవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎంవో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రత్యేక ప్రణాళికలు
మాదక ద్రవ్యాల వినియోగంలో దోషులుగా తేలినవారు ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. కఠిన చర్యల అమలుకై ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వెయ్యి మందితో కూడిన ప్రత్యేక ‘నారోటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్’ (కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్) పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రత్యేక విభాగం రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో, డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక విధులను నిర్వర్తిస్తుందని పేర్కొన్నారు.