హైదరాబాద్ : మరుగుజ్జులు ఎన్నడూ మహాత్ములు కాలేరని సీఎం కేసీఆర్ అన్నారు. గాంధీ ఆసుపత్రిలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమంలో మాట్లాడారు. ‘మహనీయుడు స్మరించుకునే అవకాశం లభించినప్పుడు.. ప్రస్తుత సమకాలిన సమాజం, సమకాలిన పోకడలు, సమకాలిన వైరుధ్యాలు తప్పకుండా మనం ఆలోచన చేయాలే. మీరందరు వింటున్నారు.. దేశం బాగుంటే.. సమాజం బాగుంటే, ప్రపంచంలో శాంతి సామర్యాలు ఉంటేనే మనం సుఖవంతమైన జీవితం కొనసాగించగలుగుతాం. అశాంతి నుంచి బయటపడగలుగుతాం’ అన్నారు.
‘మనకు ఎన్ని ఆస్తులు, అంతస్థులు ఉన్నా శాంతి లేనినాడు జీవితం ఆటవికమైతది. శాంతి, సౌభ్రాతృత్వంతో విలసిల్లే భారతదేశంలో మహాత్ముడినే కించపరిచే మాటలు వింటున్నాం. ఆ విన్నప్పుడు హృదయం బాధపడుతుంది. సమాజాన్ని చీల్చే కొన్ని చిల్లర మల్లర శక్తులు ప్రయత్నాలు చేసే విషయం మీ అందరికి తెలుసు. వెలికి వ్యక్తులు చేసే వెకిలి ప్రయత్నాల వల్ల మహాత్ముడి కృషి, మహాత్ముడి ప్రభ ఏనాటికీ తగ్గదు. మరుగుజ్జులు ఏనాటికీ మహాత్ములు కాలేరు. అవి వెకిలిగానే చరిత్రలో మిగిలిపోతాయ్ తప్ప ఏనాటికైనా, ఏ రోజుకైనా విశ్వ మానవుడిగా, విశ్వజనీన సిద్ధాంతాన్ని చెప్పిన గాంధీజీ చెప్పిన సిద్ధాంతమే ఉంటుంది. ఇదే రోజు అనుకోకుండా లాల్ బహదూర్శాస్త్రి జన్మదినం. జై జవాన్, జై కిసాన్ అనే నినాదం పిలుపునిచ్చిన మాజీ ప్రధాని, గొప్ప నిస్వార్థసేవా పరుడు, గొప్ప ధీరుడు, చైనా, పాకిస్థాన్ యుద్ధాలను అద్భుతంగా ఎదుర్కొని దేశాన్ని రక్షించినటువంటి మాజీ ప్రధాని లాల్ బహదూర్శాస్త్రి. ఆయన గాంధీజీ శిష్యుడు. గాంధీజీ ప్రేరణతో ఉన్నతస్థాయికి వచ్చి అనేక రంగాల్లో విజయం సాధించారు’ అన్నారు.
అద్భుతమైన నినాదాన్ని ఖాయం చేశారు. దేశాన్ని రక్షించే వాడు జవాన్ అయితే.. దేశానికి అన్నంపెట్టేవాడు అని చెప్పి.. ‘జై జవాన్ – జై కిసాన్’ అనే నినాదం ఇచ్చారు. కానీ, మనకండ్ల ముందే దేశంలో ఏం జరుగుతుందో ఆలోచించాలి. సమకాలిన సమాజంలో మనం భాగస్వాములం కాబట్టి బాధ్యత ఉంటుంది. మనం మౌనంగా ఉండొద్దు.. చెడును ఖండించాలి, తప్పును విమర్శించాలి, మంచిని ప్రశంసించి, ప్రోత్సహిస్తేనే సమాజానికి ఆరోగ్యం. శాస్త్రి ప్రవచించిన జై జవాన్ ఇవాళ అగ్నిపథ్లో నలిగిపోతున్నడు. జై కిసాన్ మద్దతు ధరలేక కృశించి.. నశించి పోతున్నడు. అనేక ఆత్మహత్యలు జరుగుతున్నయ్. దీన్ని నివారించకుండా ఒకరకమైనటువంటి దుర్మార్గమైన ప్రచారం జరుగుతుంది. మేధావి లోకం దాన్ని ఖండిస్తూ ముందుకు వెళ్లాలని నేను శిరస్సు వంచి ప్రార్థిస్తున్నా. విశ్వసామరస్య విజ్ఞాన సందాత గాంధీ తాతకు.. రాష్ట్రం పక్షాన, అందరి తరఫున హృదయపూర్వకమైన అంజలి ఘటిస్తున్నా’ అని సీఎం కేసీఆర్ అన్నారు.