హైదరాబాద్ : తమిళ సూపర్స్టార్ రజనీకాంత్కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నటుడిగా దశాబ్దాల పాటు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకుంటూ, నేటికి దేశవిదేశాల్లో కోట్లాది మంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజనీకాంత్కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం ప్రకటించడం గొప్ప విషయమని కేసీఆర్ అన్నారు.
సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ను 2019కి గాను రజనీకాంత్కు కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ ప్రకటించారు. 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అందుకోనున్నట్టు ఆయన తెలియజేశారు. 1969 నుండి ఈ అవార్డులని ప్రకటిస్తుండగా, ఇప్పటి వరకు 50 మంది ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకోగా, ఈ అవార్డు అందుకున్న 50వ వ్యక్తి అమితాబ్ బచ్చన్.
హిందీ చిత్ర సీమ నుండి 32 మంది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. మిగతా 18 మంది ఇతర భాషల నుండి ఎంపికయ్యారు. 2018కి గాను బిగ్బీ 66వ జాతీయ చలన చిత్రాల పురస్కారాల్లో భాగంగా అత్యున్నత సినీ జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. కాగా, తమిళనాడు ఎన్నికలు ఏప్రిల్ 6న జరగనుండగా, ఎలక్షన్స్ ముందు కేంద్రం ఈ అవార్డ్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ 2000లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్న విషయం తెలిసిందే.
ఇవీ కూడా చదవండి..