హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీ పరిపాలన రోజురోజుకూ దిగజారుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. బీజేపీ పాలన పోవాలని ఇప్పటికే దేశం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో సీట్లు తగ్గడమే దీనికి నిదర్శనమని తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణభవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ యూపీఏ పరిపాలన బాగాలేదని ప్రజలు బీజేపీకి పట్టం కడితే.. ప్రస్తుత పాలన అంతకంటే దారుణంగా తయారైందన్నారు. యూపీఏ కాలంతో పోల్చుకుంటే దేశం అన్నింటా దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. యూపీఏ హయాంలో 8 శాతం ఉన్న దేశ జీడీపీ.. ప్రస్తుతం 6 శాతానికి పడిపోయిందని వెల్లడించారు. నిరుద్యోగ రేటు 5.24% ఉండేదని, ప్రస్తుతం 9.3 శాతానికి చేరుకొన్నదని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్ల కాలంలో దేశానికి చేసింది శూన్యమని చెప్పారు. మంచి పనిచేయాలంటే, నవీన పద్ధతిలో అద్భుతమైన ఆవిష్కరణలు జరగాలంటే.. ఎనిమిదేండ్లు చాలా ఎక్కువ సమయమని గుర్తుచేశారు. బీజేపీ పాలకులు దేశంలో ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదని, ఒక్క కొత్త ఫ్యాక్టరీ పెట్టలేదన్నారు. వాళ్ల ప్రతిభ, సామర్థ్యం ఇంతేనని దేశానికి బీజేపీనే చెప్పుకొన్నదని.. ఆచరణలోనూ అదే విషయం నిర్ధారణ అయ్యిందని చెప్పారు. ఈ దేశం బాగుపడాలంటే, అభివృద్ధి పథంలోకి వెళ్లాలంటే బీజేపీకి చరమగీతం పాడాలని తేలిపోయిందని, దేశమంతా ఇదే నిర్ణయించిందని సీఎం కేసీఆర్ తెలిపారు.
తాబేదార్లకు పీఎస్యూలు
దేశంలో బీజేపీ పరిస్థితి బాగాలేదని, యూపీలో సీట్లు తగ్గుతాయని ముందే తాను చెప్పిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో యూపీ, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో బీజేపీకి గణనీయంగా సీట్లు తగ్గాయని.. పంజాబ్లో రైతుల ఆక్రోశం ఎలా ఉన్నదో దేశమంతా చూసిందని పేర్కొన్నారు. బీజేపీ పతనానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుందన్నారు. సాంకేతికంగా బీజేపీ గెలిచి ఉండొచ్చని, కానీ సీట్లు తగ్గడం దేనికి సంకేతమో ఆలోచించుకోవాలని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి కొత్తవాటి సంగతి పక్కన పెట్టి ఉన్నవాటిని అమ్మేసే పనిలో పడిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కారుచౌకగా తమ తాబేదార్లకు కట్టబెడుతున్నదని విమర్శించారు. దేశమంతా మానిటైజేషన్ చేయాలని బీజేపీ యత్నిస్తున్నదని విమర్శించారు. చివరకు గ్రామపంచాయతీలను కూడా కుదువ పెట్టుకోవాలని సలహా ఇస్తున్నదని.. మనం ఇలాగే సహిస్తే బీజేపీ దేశాన్నంతటినీ అమ్మేస్తుందని హెచ్చరించారు.
ఎన్డీయే చేతులెత్తేసింది
ప్రధాని మోదీ మంచి పాలన అందిస్తారని ఆశిస్తే.. కాంగ్రెస్ కన్నా అధ్వానంగా విఫలం అయ్యారని ఎద్దేవాచేశారు. ఈ విషయాన్ని ఇప్పటికి దేశం అర్థం చేసుకొన్నదని చెప్పారు. కేంద్రం ‘మేము ఇంతకన్నా సమర్థంగా పాలించలేము’ అని తేటతెల్లం చేసిందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం 8 బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఏ రంగంలోనూ అభివృద్ధి జరుగలేదని ఎద్దేవాచేశారు. చైనా నుంచి రూ.లక్షల కోట్ల పరిశ్రమలు తరలిపోతున్నాయని, అవి భారత్కు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. యూపీలో బెదిరించి ఓట్లు వేయించారని, ఇది వాంఛనీయం కాదన్నారు. అందుకే దేశంలో పరివర్తన రావాల్సిన అవసరం ఉన్నదన్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా వ్యవస్థలో అనేక లోపాలున్నాయని, చాలా విషయాలు పెండింగ్లో ఉన్నాయని, కాబట్టి గుణాత్మక మార్పులు రావాలని ఆకాంక్షించారు.