హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఉపాధి కోసం తెలంగాణకు వలస వచ్చి న వారందరికీ రాష్ర్టాభివృద్ధిలో భాగస్వామ్యం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణలో జీవిస్తున్నవారు ఏ రాష్ర్టానికి చెందినవారైనా వారిని తెలంగాణ బిడ్డలుగానే భావిస్తామని స్పష్టంచేశారు. తెలంగాణ అభివృద్ధిలో బీహార్ శ్రామికుల భాగస్వామ్యం ఎనలేనిదని కొనియాడారు. గల్వాన్ లోయలో అసువులు బాసిన అమరుల కుటుంబాలకు, సికింద్రాబాద్ బోయిగూడ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థికసహాయం అందజేసేందుకు బుధవారం బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ రాష్ట్ర సీఎం నితీశ్కుమార్తో కలిసి చెక్కులను అందజేశారు.
ఐదుగురు అమరజవాన్లకు చెందిన ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున, అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున అందజేసి, ఔదార్యం చాటుకొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అమరులకు నివాళి అర్పించారు. కార్మికుల కుటుంబాలను ఓదార్చారు. మీకు మేము ఉన్నామన్న భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గల్వాన్ లోయలో అసువులు బాసిన అమర సైనికుల కుటుంబాలకు, హైదరాబాద్ అగ్ని ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రణామాలు అని అన్నారు. అమరులైన సైనికుల కుటుంబాలకు సహాయం చేయాలని ఎంతోకాలంగా హృదయం భారంగా ఉండేదని, ఈ పవిత్ర భూమికి చెందిన అమరులైన సైనికుల కుటుంబాలకు స్వయంగా తమ వంతు సాయం అందజేసేందుకు పాట్నా వచ్చినట్టు తెలిపారు.
కోల్పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేమని చెప్తూ, వారి కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉండాలనే సందేశం అందరికీ చేరాలని అన్నారు. దీంతో సైనికులకు, దేశ రక్షణ దళాలకు ఆత్మసె్థైర్యం పెరుగుతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో అభివృద్ధి బాటలో సాగుతున్న యువ రాష్ట్రమని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో బీహార్కు చెందిన వేలాది శ్రామికులు భాగస్వామ్యాన్ని అందిస్తున్నారని, ఎన్నో రంగాల్లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టానికి వలస వచ్చిన బీహార్ రాష్ట్రం వారైనా, వేరే రాష్ట్రం వారైనా.. వారందరినీ తెలంగాణ ప్రతినిధులుగా భావిస్తున్నట్టు తాను కరోనా సమయంలోనే చెప్పానని గుర్తు చేశారు.
సికింద్రాబాద్ బోయిగూడ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో మరణించిన వలస కార్మికుడు దామోదర్ మహల్దార్ తల్లి లలితాదేవికి రూ.5 లక్షల చెక్కు అందజేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
కరోనా సమయంలో ప్రత్యేక రైళ్లను నడపాలని, వలస కార్మికులను వారి ఊళ్లకు పంపించాలని నాడు కేంద్రాన్ని తాను కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి వేలాది కార్మికులు, శ్రామికులను వారివారి రాష్ర్టాలకు తరలించి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకొన్నదని గుర్తు చేసుకొన్నారు. తాము గోదావరి నది ఒడ్డు నుంచి గంగా నది ఒడ్డుకు వచ్చామని, గంగా నదిని పవిత్ర నదిగా భావించినట్టుగానే, తాము గోదావరిని దక్షిణ గంగగా భావిస్తామని సీఎం కేసీఆర్ వివరించారు. జయప్రకాశ్ నారాయణ్ వంటి మహనీయుడికి జన్మనిచ్చిన పవిత్ర భూమి బీహార్ అని శ్లాఘించారు. బీహార్ ప్రజల చైతన్యంతో ప్రారంభమైన ప్రతి మార్పూ ఈ దేశంలో శాంతికి బాటలు వేసిందని పేర్కొన్నారు. బీహార్లో నలంద విశ్వవిద్యాలయం ఎంతో చారిత్రకమైనదని చెప్పారు. ఇకడికి వచ్చి ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాలుపంచుకొన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నదని అన్నారు.