గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతిరాథోడ్ తెలిపారు. ఇందుకోసమే సీఎం ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ పథకం తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే 300 మంది యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని, మరికొంతమందిని పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు డీపీఆర్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని, 43 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 7.81 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్లను అందించారు.
ఈ సందర్భంగా సత్యవతిరాథోడ్ మాట్లాడారు. ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ పథకం ప్రారంభించినప్పుడు మంత్రి కేటీఆర్ అభినందించారని, రాబోయే ఐదేళ్లలో వెయ్యిమంది పారిశ్రామికవేత్తలను తయారుచేయాలని చెప్పారన్నారు. ఆయన కోరిక మేరకు కచ్చితంగా వెయ్యిమందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
మిగతా కార్యక్రమాలు ఏవైనా ఉన్నా వాటిని పక్కనపెట్టి ఈ పథకం కింద గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. అలాగే, రాబోయే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లను దృష్టిలో పెట్టుకుని పదివేల మంది గిరిజన యువతకు లబ్ధిచేకూరేలా 38 సెంటర్ల ద్వారా ఉచిత కోచింగ్ ఇప్పించేందుకు గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ప్రత్యేక కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, అదనపు సంచాలకులు సర్వేశ్వరరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.