Christmas Special | సర్వ మానవాళి కలిసిమెలిసి సహజీవనం సాగించాలన్నదే క్రీస్తు సందేశం. తోటివారిని ప్రేమించాలన్న ప్రేమతత్వం క్రిస్మస్ పండుగలో కనిపిస్తుంది. క్రీస్తు ఉదయించిన ఈ వేళ క్రైస్తవులకు పర్వదినం. ప్రతి క్రైస్తవుడి జీవితంలోనూ మరుపురాని రోజు.
ఈ లోకంలోని వారికి శుభాలు కలిగించేందుకు దైవ కుమారుడైన ఏసు క్రీస్తు ఇలలో అవతరించాడు. లోకరక్షకుడిగా, మార్గదర్శకుడిగా నిలిచాడు. అందరికీ సన్మార్గం చూపి, పాపుల పాలిట రక్షకుడిగా నిలిచిన ఆయన జననం ఎంతో ప్రత్యేకమైనది. దేవుడికి పేర్లు అనేకం. ఆయన మహిమలు కూడా అనంతం. ప్రజలు పలురకాల పేర్లతో క్రీస్తును కీర్తిస్తుంటారు. పేరు ఏదైనా ఆయన తమ పెన్నిధి అని విశ్వసిస్తారు. క్రీస్తు సాటి మనుషులతో ఎలా మసలుకోవాలో తరచూ చెప్పేవాడు. సూక్తులు ప్రబోధించి ఊరుకునే వారు కాదు. వాటిని ఆచరించి చూపేవాడు. ‘మీరూ ఇలా చేయాల’ని పిల్లలకు చెప్పినట్టుగా ప్రజలకు పదేపదే తెలియజేసేవాడు.
ఆయన శిష్యులు పన్నెండు మందిలో పలురకాల మనస్తత్వాల వారున్నారు. అందులో పేతురు దుడుకు స్వభావి. యోహాను చాలా నెమ్మదస్తుడు. మరొకడు దొంగ. మత్తయి అందరూ అసహ్యించుకునే సుంకం వసూలు చేసే వ్యక్తి. మరొకతను రోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసేవాడు. ఇలా వేర్వేరు మనస్తత్వాలు కలిగిన శిష్యగణంతో ఆయనోసారి పంక్తి భోజనానికి కూర్చున్నాడు. ఇంతలో మెల్లిగా లేచి శిష్యుల దగ్గరికి వెళ్లాడు. వరుసగా వారందరి పాదాలు కడిగి తన భుజం మీది తువ్వాలుతో తుడిచాడు. స్వయంగా శిష్యుల పాదాలు కడిగిన క్రీస్తు ‘నాయనలారా! మీరు ఒకరి పాదాలు మరొకరు కడగండి’ అని వారికి చెప్పాడు. ఒకరి పాదాలు మరొకరు కడగటం అంటే తాము ద్వేషించేవారి పాదాలు కడిగే స్థాయికి ద్వేషాన్ని తగ్గించుకోవాలని పరోక్షంగా హెచ్చరించటమే! కులాలు, తెగలు, బీదరికం, ధనం, అహం అనే ఐదింటినీ పక్కన పెట్టి చేతిలోని ఐదువేళ్లలా ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని ఆ మహాపురుషుడు కోరాడు.
మరో సందర్భంలో శిష్యులను చెంతకు పిలిచి ‘నాయనలారా! మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎంతగా తమను తాము తగ్గించుకుని వినయ మనస్కులు అవుతారో, అంతగా ఆ ప్రేమకు సంపూర్ణత లభిస్తుంది’ అన్నాడు. ఆయన సూక్తులు మణిపూసలు. ‘ఉపకారికి ప్రత్యుపకారం చేస్తే ఇక నీ ప్రత్యేకత ఏముంది? పాపులు కూడా అలాగే చేస్తారు. కాబట్టి నీవు నీ శత్రువులకు కూడా మేలు చేయి. ఇచ్చిన అప్పును తిరిగి పొందాలని ఆశపడకు. అప్పుడు నీకు గొప్ప బహుమతి లభిస్తుంది. కుడిచేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదు. రహస్యంగా ఉండాలి. నీ రహస్య కార్యాలన్నీ గమనించే తండ్రి నీకు తగిన బహుమానం ఇస్తాడు. నీవు విందు చేసేటప్పుడు బంధువులకు, ఇరుగుపొరుగు వారిని పిలవకు. పేదలను, దివ్యాంగులను పిలువు. వాళ్లు నీకు ప్రతిఫలాన్ని ఇవ్వలేరు కాబట్టి నీవు ధన్యుడవు అవుతావు. నీతిమంతుల పునరుత్థానం రోజున నీకు అందుకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది’ ఇలా క్రీస్తు చెప్పిన ప్రతి మాటా మానవత్వాన్ని తట్టిలేపేదే. మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేదే.
ఆ మహాపురుషుడు పాపులను ఎంతగానో ప్రేమించాడు. వారు పాపంతో మరణించాల్సి వస్తే మరణ శిక్షను తొలగించేందుకు తన ప్రాణాలనే అర్పించాడు. అలాంటి నిస్వార్థ ప్రేమనే ఆయన మన నుంచి ఆశించేది. వసుధపై సర్వమానవ సౌభ్రాతృత్వం ఉండాలని ‘నీవలె నీ పొరుగువారిని ప్రేమింపుము’ అని ప్రబోధించాడు క్రీస్తు. ఆ వాక్యంలోని లోతును, ఆర్ద్రతను మనిషి అర్థం చేసుకొని ప్రభువు ప్రబోధాలను పాటించినట్లయితే సహనం, సమరస భావం అలవడి మానవుడు మహనీయుడు అవుతాడు. క్రీస్తు సందేశం ఇదే. ఆ మహనీయుడు మన నుంచి కోరుకున్నదీ ఇదే.
సెయింట్ నికోలస్ అనే క్రైస్తవ మతగురువునే శాంతా క్లాజ్ అని సంబోధిస్తారు. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలకూ ఆయనంటే అంతే అభిమానం. క్రిస్మస్ సమయంలో ఇతరులకు మనకు తోచిన బహుమతిని ఇస్తుంటాం. కనీసం శుభాకాంక్షలను చెబుతుంటాం. ఈ సంప్రదాయానికి శాంతా క్లాజ్ తాతనే నాంది పలికాడు. క్రిస్మస్ సమయంలో ఇంటింటికీ తిరిగి తనకు ప్రియాతి ప్రియమైన చిన్నారులందరికీ బహుమతులు, ఆట వస్తువులు, చాక్లెట్లు వంటి తినుబండారాలు పంచిపెడుతూ ఉండేవాడు. శాంతా క్లాజ్ స్ఫూర్తితోనే నేటికీ పెద్దల నుంచి పిల్లలకు క్రిస్మస్ సందర్భంగా బహుమానాలు అందుతూ ఉంటాయి. మూర్తీభవించిన ప్రేమకు, నిస్వార్థ పరాయణతకు ప్రతీక శాంతా క్లాజ్. మనకు ఉన్నది ఆనందంతో ఇతరులకు పంచి ఇవ్వడమే మనకు ఆత్మానందాన్నిచ్చే అత్యుత్తమ మార్గమనేది శాంతా క్లాజ్ దివ్య సందేశం.
✍ డా॥ వనిత విజయకుమార్ ద్యాప
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Christmas Special | ఈ క్రిస్మస్కు ప్రత్యేకంగా కనిపించాలా? ఈ డిజైన్లను ట్రై చేయండి
Rakul Preet Singh Christmas | రకుల్ ఈ సారి ఎవరితో క్రిస్మస్ చేసుకోబోతుందంటే..?