న్యూఢిల్లీ: తూర్పు లఢక్లోని పాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మిస్తున్నట్టు భౌగోళిక నిఘా నిపుణుడు డేమియన్ సైమన్ వెల్లడించారు. చైనా తన ఆధీనంలోని ప్రాంతంలోనే సరస్సు రెండు ఒడ్డులను కలుపుతూ వంతెన నిర్మిస్తున్నదనీ, సైనిక బలగాలు, ఆయుధాల తరలింపులో అది అనువుగా ఉండడం గమనార్హమైన విషయమని పేర్కొన్నారు. సరస్సు వెడల్పు తక్కువగా ఉండే చోట వంతెన నిర్మిస్తున్నట్టు సైమన్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఉపగ్రహ చిత్రాన్ని కూడా దానికి జత చేశారు. వంతెన తుదిదశలో ఉన్నట్టు ఆ ఫొటోను బట్టి తెలుస్తున్నది. గత ఏడాది సరస్సు దక్షిణ ఒడ్డు వైపున్న కైలాశ్ పర్వతాలపైకి భారత సైన్యం చేరుకుని స్థావరాలను పటిష్ఠపరచుకుంది. ఇప్పుడు చైనా పాంగాంగ్ సరస్సు వంతెనతో చెక్ పెట్టాలని చూస్తున్నది. వివాదాస్పదమైన లఢక్ ప్రాంతంలో ఇటీవలి కాలంలో భారత, చైనా దళాల మధ్య ఘర్షణలు జరిగాయి. రెండు దేశాలు చర్చలు జరిపి ఉద్రిక్తతల ఉపశమనానికి చర్యలు చేపట్టాయి.