కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా అనేక ఆరోగ్య పథకాలు, సేవలను అందిస్తున్నాయి. కానీ, సరైన సమాచార వ్యవస్థ లేకపోవడం వల్ల చాలామంది వీటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ సరికొత్త ఆవిష్కరణకు రూపమిచ్చారు యాదగిరిగుట్ట బాలుర జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు. సామాన్యుల సమస్యకు పరిష్కారం చూపే ఈ ప్రాజెక్టు తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్-2021లో రాష్ట్రస్థాయికి ఎంపికవగా, వచ్చే నెల 4న హైదరాబాద్లో గ్రాండ్ ఫినాలేలో ప్రదర్శించనున్నారు. గతేడాది తుర్కపల్లి మండలం ముల్కలపల్లి జడ్పీహెచ్ఎస్ బాలికలు జీరో వేస్ట్ శానిటరీ ప్యాడ్స్ తయారీతో ప్రథమ బహుమతిని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ సృజనాత్మకతతో రాష్ట్రస్థాయిలో సత్తా చాటుతుండడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
యాదాద్రి భువనగిరి, మార్చి30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాఠశాల విద్యార్థుల్లోని సృజనాత్మకత వెలికితీతకు ప్రభుత్వం ‘తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నది. విద్యార్థుల్లో నిగూఢమైన నైపుణ్యం ప్రదర్శనకు ఈ వేదిక దోహదపడుతున్నది. విద్యార్థులు సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి వినూత్న ఆలోచనలతో పోటీల్లో పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు. 2020 సంవత్సరం నుంచి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులకు తుది రూపునిచ్చి, ఉత్పత్తులుగా మార్చి పేటెంట్ హక్కులు పొందే అవకాశాన్ని సైతం కల్పిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా అనేక ఆరోగ్య పథకాలు, సేవలను అందిస్తున్నాయి. అయితే సరైన సమాచార వ్యవస్థ లేక చాలామంది వీటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ సమసల పరిష్కారానికి యాదగిరిగుట్ట బాలుర జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు వినూత్న ప్రాజెక్టు ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వాలు అందిస్తున్న అన్ని సేవలకు సంబంధించి ఒక యాప్ను రూపొందించారు. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అన్ని సేవలను ఎప్పటికప్పుడు తెలుసుకుని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ సంబంధిత సమాచారాన్ని టెక్ట్స్ మెసేజ్లు లేదా ఐవీఆర్ కాల్స్తో ఆయా ప్రాంతీయ భాషల్లో తెలుసుకోవచ్చు. వాట్సాప్ చాట్బాత్ మద్దతుతోనూ పథకాల సమాచారాన్ని పొందవచ్చు. హెల్ప్లైన్ నంబర్లతో సైతం సమగ్రంగా వివరాలను తెలుసుకునేందుకు వీలుంది. ప్రస్తుతం ప్రతి వ్యక్తి వద్ద మొబైల్ ఫోన్ అందుబాటులో ఉన్నందున విద్యార్థులు ఈ వినూత్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చారు.
జిల్లాలో 298పాఠశాలల నుంచి 495 విద్యార్థి బృందాలు 1,008ప్రాజెక్టులు పంపగా జిల్లాస్థాయికి నాలుగు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. వీటిలో ఒక ప్రదర్శన నమూనా రాష్ట్రస్థాయికి ఎంపికైంది. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో వచ్చిన నమూనాలతో పోటీపడి యాదగిరిగుట్ట జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు పి.సాయిప్రియ, బి.భవ్యశ్రీ, కె.శశాంక్, టి.జ్యోతి రూపొందించిన ప్రయోగం ఎంపికైంది. ఏప్రిల్ 4న నిర్వహించే గ్రాండ్ ఫినాలేలో రాష్ట్రం నలుమూలల నుంచి ఎంపిక చేసిన 20ప్రదర్శనల్లో వీరు రూపొందించిన ప్రయోగాన్ని ప్రదర్శించనున్నారు. ఉత్తమ ప్రదర్శనకు రూ.75వేల నగదు పారితోషికాన్ని అందించనున్నారు. రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైన సందర్భంగా యాదగిరిగుట్ట జడ్పీహెచ్ఎస్ విద్యార్థులను హెచ్ఎం జె.ప్రభావతి, గైడ్ టీచర్ ఖాజా అలీ షరీఫ్ను డీఈఓ కానుగుల నర్సింహ అభినందించారు.