Telangana | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను కుదిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. కనీసం 15 జిల్లాలను రద్దు చేస్తారన్న ప్రచారంతో ఆయా జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వివిధ రంగాల విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఇదే జరిగితే రాష్ట్రం ఆగమవుతుందని హెచ్చరిస్తున్నారు. జిల్లాల సంఖ్య కుదింపుతో సామాజికంగా, ఆర్థికంగా, ఇతర అనేక కోణాల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టంచేస్తున్నారు. పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం అనేక చర్చోపచర్చలు, తర్జనభర్జనలు, ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని 33 జిల్లాలుగా విస్తరించిన సంగతి తెలిపిందే. దీనికి అనుగుణంగా జిల్లా కేంద్రాల్లో వసతులు కల్పించింది. భవనాల నిర్మాణాలు మొదలు సిబ్బంది, ఇతర మౌలిక వసతులు.. ఇలా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కొత్త జిల్లాల కేంద్రంగా పాలన సవ్యంగా సాగుతున్నది. ఇప్పుడు కొత్తగా మళ్లీ జిల్లాల సంఖ్యను కుదించడం అంటే.. అనేక కొత్త సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జిల్లా కేంద్రాలు అభివృద్ధికి కేరాఫ్గా మారాయి. ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువయ్యాయి. ప్రైవేట్ కంపెనీలు, పరిశ్రమలు, బ్యాంకులు, రోడ్లు, రైలు మార్గాలు, ప్రాజెక్టులు.. ఇలా జిల్లా కేంద్రానికి అనేక అదనపు హంగులు చేకూరాయి. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. జిల్లా కార్యాలయాలన్నీ అత్యంత సమీపంలోకి వచ్చాయని ప్రజలు సంతోషంగా చెప్తున్నారు. పరిధి చిన్నగా ఉండటంతో పాలనపై కలెక్లర్ల ప్రత్యక్ష పర్యవేక్షణ పెరిగింది. దీంతో ప్రజా సమస్యలు వేగంగా పరిష్కారం అవుతున్నాయి. అన్ని శాఖలకు జిల్లా స్థాయి అధికారులు రావడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రజలకు చేరుతున్నాయి. ఎస్పీ కార్యాలయాలు పెరుగడంతో నియంత్రణ పెరిగి, నేరాలు గణనీయంగా తగ్గాయి. వీటితోపాటు జిల్లా స్థాయిలో ఉండేలా దవాఖానలు, విద్యాసంస్థలు, రోడ్లు, ఇతర మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా కేంద్రాలకు భారీగా ప్రైవేట్ పెట్టుబడులు కూడా తరలిరావడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తరించాయి. జిల్లా కేంద్రాలు వర్తక, వాణిజ్య, వ్యాపార కేంద్రాలుగా, రాష్ర్టానికి ఆర్థిక వనరులుగా మారాయని ప్రజలు, ఆర్థికరంగ విశ్లేషకులు అంటున్నారు.
జిల్లాల సంఖ్యను కుదించడం వల్ల అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు భారీగా నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జిల్లాల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నది అందరి నుంచి వస్తున్న మొదటి ప్రశ్న. ఇప్పటికీ తమ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లే వినిపిస్తున్నాయి తప్ప, తమకు జిల్లా వద్దనే డిమాండ్ ఎక్కడా లేదని, మరి ప్రభుత్వం ఎందుకు ఉబలాట పడుతున్నదని ప్రశ్నిస్తున్నారు.
చిన్న జిల్లాలతో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా స్థాయి అధికారులకు పరిధి తగ్గింది.. పర్యవేక్షణ పెరిగింది. దీంతో జిల్లాలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే వారి దృష్టికి వస్తున్నది. తదనుగుణంగా చర్యలు తీసుకొని, సమస్యలను పరిష్కరిస్తున్నారు. పథకాల అమలుతోపాటు నేర నియంత్రణలో చిన్న జిల్లాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. జిల్లాల సంఖ్యను కుదిస్తే మళ్లీ పరిధి పెరిగి, పర్యవేక్షణ లోపం తలెత్తుతుంది. ప్రజల సమస్యలు అధికారుల వద్దకు చేరడానికి సమయం పడుతుంది.
కొత్త జిల్లాల ప్రకారం అన్ని శాఖల్లోనూ క్యాడర్స్ట్రెంత్ను పునర్వ్యవస్థీకరించారు. దీంతో జిల్లా స్థాయి అధికారులతోపాటు ఆయా కార్యాలయాల్లో ఉండే అటెండర్ వరకు అన్ని రకాల పోస్టులు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. ఉద్యోగులకు వేగంగా పదోన్నతులు కలిగాయి. ఇప్పుడు జిల్లాల సంఖ్యను కుదిస్తే.. కలెక్టర్లు మొదలు జిల్లా కేంద్రంలోని అన్ని శాఖల హెచ్వోడీలు, ఆయా కార్యాలయాల్లో పనిచేసే అటెండర్ల వరకు వందలాది పోస్టులు రద్దవుతాయి. ప్రభుత్వంలో అధికారుల సంఖ్య తగ్గిపోతుంది. ప్రమోషన్లు నెమ్మదిస్తాయి.
ఒకప్పుడు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు పుట్టకొకటి చెట్టుకొకటి అన్నట్టుగా ఉండేవి. ప్రజలు రెండుమూడు కార్యాలయాలు తిరగాలంటే రోజంతా పట్టేది. కేసీఆర్ ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతోపాటు.. ప్రతి జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్ భవనాలను నిర్మించింది. రద్దు చేసిన జిల్లా కేంద్రాల్లో ఆయా భవనాలు అలంకారప్రాయంగా మారుతాయి.
జిల్లాల సంఖ్య మార్పుతో జోన్ల విభజన కూడా కచ్చితంగా జరగాల్సి వస్తుంది. నూతన జోనల్ వ్యవస్థను రూపొందించాలి. దానికి అసెంబ్లీ ఆమోదం తీసుకొని, ఆ తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం పంపాలి. అక్కడ ఆమోదం తర్వాతే కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి అనుమతుల ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఒకటి రెండేండ్లు పడుతుంది. అప్పటివరకు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఆస్కారం ఉండదు. ఫలితంగా నిరుద్యోగులు నష్టపోతారు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, గ్రంథాలయ చైర్మన్ వంటి ప్రజాప్రతినిధుల పోస్టుల సంఖ్య కూడా పెరిగింది. రాజకీయంగానూ జిల్లాల సంఖ్య తగ్గించడం పార్టీలకు ఇబ్బంది కలిగిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. జిల్లాల వారీగా పార్టీలు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అనుబంధ కమిటీలు ఇలా వందలాది మందికి ప్రాతినిధ్యం కల్పించాయి. వారంతా ఇప్పుడు పదవులు కోల్పోయే అవకాశం ఉంటుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా కేంద్రంగా అనేక ప్రాజెక్టులు చేప్టటాయి. ఉదాహరణకు జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చివరి దశలో ఉన్నది. వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లా కేంద్రంలోని దవాఖానలను ప్రభుత్వం అప్గ్రేడ్ చేస్తున్నది. ఇలాంటి పథకాలు ఇప్పుడు గందరగోళంలో పడతాయి. జిల్లా దవాఖానలకు కేంద్రం నుంచి నిధులు వస్తుంటాయి. ఇవి ఆగిపోవడంతోపాటు జిల్లా దవాఖాన హోదా కోల్పోయి, వసతులు తగ్గిపోతాయి. వెనుకబడిన జిల్లాలు వంటివి జిల్లా ఆధారంగానే గుర్తిస్తుంటారు. ఇలాంటివన్నీ ఆగిపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కొత్త జిల్లాలు పెట్టుబడులను ఆకర్షించే కేంద్రాలుగా మారాయి. ప్రైవేట్ కంపెనీలు తరలివస్తున్నాయి. ముఖ్యంగా రియల్ఎస్టేట్ రంగం విపరీంతంగా పెరిగింది. సమీప గ్రామాల నుంచి ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వలసలు పెరిగి నిర్మాణాలు పెరిగాయి. భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. జిల్లాల రద్దుతో రియల్ఎస్టేట్ రంగం కుదేలవుతుంది.
జిల్లాలను రద్దు చేస్తే అప్పటికే ఆ ప్రాతంలోకి వచ్చిన ప్రైవేట్ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతాయి. ఫలితంగా నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయి. మొత్తంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆలోచనతో ప్రయోజనం దాదాపు శూన్యమని, ఇదే సమయంలో నష్టం మాత్రం అపారంగా ఉంటుందని నిపుణులు, సామాన్య ప్రజలు హెచ్చరిస్తున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు అసలు ప్రతిపాదిక ఏమిటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు జనాభా, జనసాంద్రత, భౌగోళిక విస్తీర్ణం, ఆ ప్రాంత ప్రజల జీవనశైలి, ప్రజల నుంచి వచ్చే డిమాండ్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటులో ఇలాంటి పద్ధతినే పాటించారు. కానీ, ప్రభుత్వం ఇప్పుడు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఏపీలో కూడా ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటుచేశారు. ఇదే తరహాలో తెలంగాణలో చేస్తే.. 33 జిల్లాలకు మిగిలేవి 17 మాత్రమే. 2026లో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ఉన్నదని, మరి అప్పుడు కూడా మళ్లీ కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
ఒక ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులు, వసతులను బట్టి కొందరికి మంచి విద్యావకాశాలు దొరికితే, మరికొందరికి సరైన సదుపాయాలు ఉండకపోవచ్చు. ఫలితంగా ఒకే జిల్లాలో ఉండే ఒక ప్రాంతం నిరుద్యోగుల్లో నాలెడ్జ్ లెవల్ ఎక్కువగా ఉంటే, మరో ప్రాంతం అభ్యర్థులు కాస్త వెనుకబడి ఉంటారు. దీంతో ఆ జిల్లాల్లో జరిగే నియామకాల్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఒకే ప్రాంతంవారికి వచ్చేవి. మిగతావారు అన్యాయం అయ్యేవారు. కేసీఆర్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి ఈ అన్యాయాన్ని చాలావరకు సరిదిద్దింది. ఒకే రకమైన పరిస్థితులు ఉన్న ప్రాంతాలు జిల్లాలుగా మారాయి. ఉదాహరణకు గ్రామీణ పరిస్థితులు ఎక్కువగా ఉండే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి వంటి ప్రాంతాలు జిల్లాలుగా మారి, ఆయా జిల్లాల నిరుద్యోగులకు న్యాయం కలిగింది. రద్దు చేస్తే వారు తిరిగి అన్యాయానికి గురవుతారు.
ఉమ్మడి జిల్లాల్లో ప్రజలు జిల్లా అధికారులను కలువాలంటే వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. అనేక సందర్భాల్లో రాత్రికి అక్కడే బస చేసి, మరుసటి రోజు తిరిగి రావాల్సి వచ్చేది. తద్వారా ఒకటి రెండు రోజులు సమయం వృథాతోపాటు బస్సు చార్జీలు, తిండి, హోటల్ గది అద్దె.. ఇలా ఆర్థికంగా భారం అయ్యేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ సగటున 50-80 కిలోమీటర్ల దూరంలోనే జిల్లా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. దీంతో పొద్దున్న బయల్దేరి వెళ్లి మధ్యాహ్నానికో, సాయంత్రానికో తిరిగి వస్తున్నారు. ఒక్క రోజులోనే పని పూర్తవుతున్నది. కొన్నిచోట్ల మధ్యాహ్నానికే ఇంటికి తిరిగి వచ్చేంత సులభం అయ్యిందని ప్రజలు అంటున్నారు. జిల్లాలను కుదిస్తే మళ్లీ ఆ తిప్పలు మొదలవుతాయి.
కామారెడ్డి, మే 4: కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జిల్లాలను రద్దు చేస్తే ఆ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్ హెచ్చరించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని అన్నారు. కామారెడ్డిలో శనివారం వారు మీడియాతో మాట్లాడారు. కొట్లాడి సాధించుకున్న కామారెడ్డి జిల్లా జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా వచ్చే ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీకి తాళాలు పడే రోజులు వస్తాయని, ఇప్పటికే 20 శాతం బస్సులు డిపోలకే పరిమితమైనట్టు వారు పేర్కొన్నారు.
పదేండ్లలో బీజేపీ దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ధాన్యం కొనాలని ఢిల్లీకి వెళ్లి అడిగితే నూకలు తినాలని కేంద్ర మంత్రులు చెప్పిన విషయాన్ని వారు గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి నూకలు బుక్కిస్తారని తెలిపారు. మతం పేరుతో బీజేపీ నేతలు మాట్లాడితే వాళ్ల మీద కేసులు ఉండవు, కానీ కేసీఆర్ మాట్లాడితే మాత్రం కేసులు పెడతారని ధ్వజమెత్తారు. కామారెడ్డి జిల్లాను రద్దు చేసి, 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న జహీరాబాద్ను జిల్లాగా చేయాలని యత్నిస్తున్నారని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లాను రద్దు చేయడం లేదని ఈ నెల 13లోపు ప్రకటించకపోతే ఉద్యమాన్ని లేవదీస్తామని హెచ్చరించారు.
జిల్లా స్థాయి అధికారులు, ఆఫీస్లు మళ్లీ ప్రజలకు దూరమవుతాయి.
సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, కమిషనరేట్లు అలంకారప్రాయంగా మారుతాయి.
జిల్లా దవాఖానల స్థాయి పడిపోతుంది. నిధులు, సదుపాయాలు తగ్గిపోతాయి.
జోనల్ వ్యవస్థను మళ్లీ మార్చాల్సి వస్తుంది.
కొత్త జోనల్ వ్యవస్థ వచ్చే వరకు నోటిఫికేషన్లు, నియామకాలు ఉండవు.
ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతారు.
క్యాడర్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. ఇది ఉద్యోగుల ప్రమోషన్లపై ప్రభావం చూపుతుంది.
జిల్లాల ప్రాతిపదికన కేంద్రం నుంచి వచ్చే నవోదయ వంటి విద్యాసంస్థలు, నిధులు తగ్గిపోతాయి.
వెనుకబడిన ప్రాంతాల్లోని నిరుద్యోగులకు అన్యాయం.