ఇబ్రహీంపట్నం : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు ఇవ్వటంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరి వలన జిల్లాలోని ఇబ్రహీంపట్నం ప్రాంతానికి సాగునీరు అందించటంలో జాప్యం జరుగుతుందని, ఈ ప్రాంతం పచ్చబడటం బీజేపీకి ఇష్టం లేదని రాష్ట్ర టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు మున్సిపాలిటీల్లో ఆయన మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో కలిసి రూ. 121కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా లాంటి వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు.
ఈ పథకానికి జాతీయహోదా ఇవ్వాలని అనేకమార్లు కేంద్రాన్ని కోరినప్పటికీ జాతీయహోదా ఇవ్వకపోగా అరపైసా నిధులు కూడా ఇవ్వలేదన్నారు. దీంతో ఇబ్రహీంపట్నంలాంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటానికి సాగునీరు అందించే కార్యక్రమానికి జాప్యం జరుగుతుందని మంత్రి అన్నారు. అలాగే ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ముచ్చర్ల సమీపంలో ఫార్మాసిటిని ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం ముందుకొచ్చిందని, దీనికి కూడా కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. కేంద్రం పైసా ఇవ్వకుండా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ రంగంలో ఎంతో ముందుకెలుతున్నామన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి శాశ్వతంగా సాగునీరు అందించాలని స్థానిక శాసన సభ్యులు మంచిరెడ్డి కిషన్రెడ్డి అనేకసార్లు తన దృష్టికి తీసుకువచ్చారని ఆయన కళలను నిజం చేయటం కోసం ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అన్నారు. అలాగే, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయంజాల్, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీల్లో మిషన్భగీరథ పైపులైన్ కోసం రోడ్లు పూర్తిగా తవ్వటం వలన అద్వానంగా మారాయని వాటిని మరమ్మతు చేయటానికి నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే కిషన్రెడ్డి కోరారు. వెంటనే స్పందించిన మంత్రి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికీ రూ. 15కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే, మిగిలిన మున్సిపాలిటీలకు కూడా అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. అలాగే, ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుందరీకరణ పనుల కోసం అవసరమైన నిధులను కూడా ప్రభుత్వం అందజేస్తుందన్నారు. నగరానికి అతి సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నం పెద్దచెరువును కూడా తుర్కయాంజల్ మాసాబ్చెరువు తరహాలోనూ అభివృద్ధి చేయాలని ఇందుకోసం అవసరమైన నిధులను అందజేస్తామన్నారు.