హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : 2024 -25 విద్యాసంవత్సరంలో పలు ప్రవేశ పరీక్షలకు వేళయింది. మే, జూన్ మాసాల్లో ఈ పరీక్షల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. మే 6 టీఎస్ ఈసెట్తో ప్రారంభమై… జూన్ 6 నుంచి 9 వరకు నిర్వహించే పీజీఈసెట్తో పరీక్షలు ముగుస్తాయి. కీలకమైన ఎప్సెట్ ఎగ్జామ్ మే 7 నుంచి 11 వరకు జరుగనున్నది. ఇంజినీరింగ్ మొదలుకొని.. బీఈడీ, లా, ఎంబీఏ, ఎంసీఏ సహా అన్ని రకాల కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెలల్లోనే పరీక్షలు జరుగుతాయి.
పరీక్షలను సజావుగా నిర్వహించి, ఆ తర్వాత ఫలితాలు ప్రకటించి జూన్, జూలై మాసాల్లో సీట్ల భర్తీ ప్రక్రియ చేపడుతారు. ఈ ఏడాది ఎప్సెట్కు భారీగా దరఖాస్తులొచ్చాయి. ప్రత్యేకించి ఇంజినీరింగ్ విభాగానికి 50 వేలకు పైగా దరఖాస్తులొచ్చాయి. నిరుడు ఇంజినీరింగ్కు 2.05,351 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 2,54,051 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇక ఫార్మసీ విభాగానికి నిరుడు 1,15,332 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 99, 831 దరఖాస్తులొచ్చాయి.
గతంలోనే ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల కాగా, దరఖాస్తుల స్వీకరణ ముగింపు దశకు చేరింది. పరీక్షలకు వారం, పది రోజుల ముందు నుంచి హాల్టికెట్లు జారీచేసి, షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు. కరోనాతో గతంలో ప్రవేశ పరీక్షలు ఆలస్యంగా జరుగగా, సీట్ల భర్తీ ఆలస్యమయింది. దీని ప్రభావం సెమిస్టర్ పరీక్షలపై పడి విద్యాసంవత్సరాన్ని పొడిగించాల్సిన పరిస్థితులొచ్చాయి. కానిప్పుడు ముందుగానే షెడ్యూళ్లను ప్రకటించడంతో ఈ ఏడాది తరగతులు సకాలంలో ప్రారంభయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కోర్సు లు పూర్తిచేసిన వారికి క్యాంపస్ ప్లేస్మెంట్కు అనువైన సమయంలోనే సర్టిఫికెట్లు చేతికందనున్నాయి.