అగ్ర నటుడు ప్రభాస్ అవసరమైనప్పుడల్లా తన పెద్ద మనసును చాటుకుంటూనే ఉన్నారు. పెదనాన్న కృష్ణంరాజు మాదిరిగానే, ప్రభాస్ చేయి కూడా పెద్దదని పరిశ్రమలో టాక్ కూడా ఉంది. రీసెంట్గా మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు ప్రభాస్. మే 4న విఖ్యాత దర్శకుడు స్వర్గీయ దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ‘డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్’ జరుపనుంది. ఈ సందర్భంగా అసోసియేషన్కు ప్రభాస్ 35 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. సోమవారం జరిగిన తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ నిర్వహించిన ‘డైరెక్టర్స్ డే ఈవెంట్’ కర్టన్రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు మారుతి ఈ విషయాన్ని సంఘ సభ్యులకు వెల్లడించారు.
సంఘ సభ్యులు హర్షం వెలిబుచ్చుతూ, దర్శకుల సంఘం సంక్షేమ నిధి కోసం ఆ డబ్బును వెచ్చించనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంలోనే ‘డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్’ ఈవెంట్ వివరాలను సంఘం సభ్యులు వివరించారు. ప్రతిభా పురస్కారాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుక వైభవంగా జరుగుతుందని, మదర్స్డే, ఫాదర్స్డే ఉన్నట్లే డైరెక్టర్స్ డే కూడా చిరస్థాయిగా నిలవాలనేది తమ ఆకాంక్ష అని, ఇప్పటివరకూ చిన్నగా జరిగిన ఈ కార్యక్రమం ఈసారి ఎల్బీ స్డేడియంలో ఘనంగా జరుగనుందని దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సాయిరాజేశ్, రేలంగి నరసింహారావు, వి.విజయేంద్రప్రసాద్, రాంప్రసాద్, వీఎన్ ఆదిత్య, సముద్ర, ఎన్.శంకర్, హరీశ్శంకర్, మారుతి, వశిష్ఠ, అనుదీప్ కేవీ తదితరులు మాట్లాడారు. తదనంతరం తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ వెబ్సైట్ను విజయేంద్రప్రసాద్, హరీశ్శంకర్ లాంచ్ చేయగా, ‘డైరెక్టర్స్ డే’ లోగోను రేలంగి నరసింహారావు ఆవిష్కరించారు.