మెహిదీపట్నం, నవంబర్ 12 : తియ్యని మాటలు చెప్పింది. తెలిసిన వారి వద్ద సుమారు రూ.రెండుకోట్ల వరకు అప్పు చేసింది. వాటిని తీర్చేందుకు అడ్డదారులు తొక్కింది. అప్పు తీరుస్తానని ఇంటికి పిలిచి సినిమాల్లో వాడే నకిలీ నోట్లు ఇచ్చింది. వారికి అనుమానం రాకముందే తనకే వారు సినిమా కరెన్సీ ఇచ్చి మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరకు పోలీసుల విచారణలో కిలాడీ లేడీ గుట్టు రైట్టెంది. గోల్కొండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… సెవన్టూంబ్స్ రోడ్డులో నివాసముండే సమీనా రూహి(33) తనకు తెలిసిన వారి వద్ద రూ.2కోట్లు అప్పు చేసింది. ఈ నెల 8న ఆసిఫ్నగర్ షాహిద్నగర్కు చెందిన మహ్మద్ సోహైల్కు ఫోన్ చేసి తనకు అప్పుగా ఇచ్చిన రూ.15లక్షలు తిరిగి ఇస్తానని ఇంటికి పిలిచింది. అతడికి డబ్బులను ఓ పాలిథిన్ కవర్లో ఉంచి ఇచ్చింది. డబ్బులు తీసుకున్న సోహైల్ నోట్లను పరిశీలించగా నోట్ల కట్టలపైన అసలు నోట్లు బండిల్లో జిరాక్స్ నోట్లు, సినిమాల్లో వాడే చిన్న పిల్లల నోట్లు ఉన్నాయి. దీంతో తాను మోసపోయానని గ్రహించి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే సమీనా రూహి తనకు అప్పు తీర్చేందుకు కొందరు నకిలీ నోట్లు ఇచ్చారని బాధితుడి కంటే ముందే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు సమీరా రూహి మోసానికి పాల్పడటంతో పాటు పోలీసులను సైతం తప్పుదోవ పట్టించినట్లు గుర్తించారు. దీంతో సమీనారూహితో పాటు ఆమెకు సహకరించిన ఆర్టీసీ క్రాస్ రోడ్కు చెందిన ధనావంత్(39), బాలాపూర్కు చెందిన సుదర్శన్(50), లింగంపల్లి చందానగర్కు చెందిన ఏఎస్.కిశోర్(46)లను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.