హైదరాబాద్ : హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో దళితబంధు పథకం అమలును నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాసింది. ఎన్నిక పూర్తయ్యే వరకు పథకం అమలును ఆపాలని ఈసీ సూచించింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందే పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి అమలు చేస్తున్నది.
ఇప్పటికే పలువురు లబ్ధిదారులకు పథకం కింద చెక్కులు అందగా.. యూనిట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నెల 30న హుజూరాబాద్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఈ క్రమంలో పథకాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పథకం అమలు కొనసాగితే ఎన్నికల్లో తాము గెలువలేమని భయంతోనే ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈసీ పథకాన్ని నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాసినట్లుగా తెలుస్తున్నది.