CBI arrest | జమ్ముకశ్మీర్లో సబ్ ఇన్స్పెక్టర్ల పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కేసులో ఓ బీఎస్ఎఫ్ కమాండెంట్ను సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్కు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి సమాచారం అందలేదు. అయితే, సీబీఐకి పట్టుబడిన బీఎస్ఎఫ్ అధికారిని జమ్ము నగర శివారులోని పాలౌరా ఫ్రాంటియర్స్ హెడ్క్వార్టర్స్లో వైద్య అధికారి డాక్టర్ కర్నైల్ సింగ్ అని తెలుస్తున్నది. విచారణలో సంతృప్తికర సమాధానాలు ఇవ్వకపోవడంతో ఆయనను సీబీఐ బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడి అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని సీనియర్ బీఎస్ఎఫ్ అధికారులకు తెలియజేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.
ఎన్ఐ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కేసులో ఆగస్టు 3న సీబీఐ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి ఇది తొమ్మిదో అరెస్ట్. మిగతా ఎనిమిది మందిలో జమ్ముకశ్మీర్ పోలీస్ సెలక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్ రామన్ శర్మతోపాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఇండియా రిజర్వ్ పోలీస్ సిబ్బంది, మాజీ సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఇద్దరు అఖ్నూర్ నివాసితులు, హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వివిధ రాష్ట్రాలు, జమ్ముకశ్మీర్లో సీబీఐ విస్తృతంగా దాడులు నిర్వహించింది. అనంతరం జమ్ముకశ్మీర్ స్టేట్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సెక్షన్ ఆఫీసర్, ఓ ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ యజమానితో పాటు 33 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఎస్ఐ ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు జేకేఎస్ఎస్ఆర్ బోర్డు పరీక్షలు నిర్వహించి, మార్కులు విడుదల చేసిన తర్వాత జమ్ముకశ్మీర్ హోం శాఖ జూన్ 4 వ తేదీన 1,200 సబ్ ఇన్స్పెక్టర్ల మెరిట్ జాబితాను ప్రకటించింది. అయితే, అవకతవకల ఆరోపణల నేపథ్యంలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వం అంతర్గత విచారణకు ఆదేశించింది. మెరిట్ జాబితాను రద్దు చేసింది. అనంతరం కేసును సీబీఐకి బదిలీ చేసింది.