చండీగఢ్ : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పంజాబ్ కాంగ్రెస్లో అంతర్గత కలహాలు మరింత పెరుగుతున్నాయి. నవజోత్సింగ్ సిద్ధూకు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్సింగ్.. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీని హెచ్చరిస్తూ ఘాటుగా లేఖ రాశారు. పంజాబ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు పార్టీ అధినేతకు లేఖ రాయడం కాంగ్రెస్ పార్టీలో ఇదే మొదటిసారి. ఈ లేఖ ప్రస్తుతం పంజాబ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సిద్ధూ, కెప్టెన్ ఎవరికి వారు తమతమ అనుయూయులతో సమావేశాలు నిర్వహిస్తూ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ శుక్రవారం పొద్దుపోయాక తమ పార్టీ అధినేత్రి అయిన సోనియా గాంధీకి ఒక లేఖ రాశారు. పార్టీ హైకమాండ్ పంజాబ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించకూడదని ఆ లేఖలో సుతిమెత్తగా హెచ్చరించారు. కాదు, కూడదంటే.. చాలా నష్టపోవలసి వస్తుందని స్పష్టమైన మాటల్లో చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నందున పార్టీ హైకమాండ్ జోక్యంతో నష్టపోతామని, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేలా ముందుండి నడుపుతానని తన లేఖలో కెప్టెన్ పేర్కొన్నారు.
అంతకుముందు శుక్రవారం సోనియా గాంధీని సిద్ధూ ఢిల్లీలో కలిశారు. వీరి సమావేశం అనంతరం సోనియాకు లేఖ రాయడం ద్వారా కెప్టెన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయడాన్ని కెప్టెన్ ఇష్టపడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పంజాబ్ కాంగ్రెస్ రెండు ముక్కలయ్యే స్థాయికి చేరుకుంది. పంజాబ్ కాంగ్రెస్ ఇంఛార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హరీష్ రావత్ చండీగఢ్ చేరుకుని పరిస్థితులను చక్కదిద్దే పనిని భుజాలపైకి ఎత్తుకోనున్నారు. హరీష్ రావత్ పంజాబ్లో సీఎం అమరీందర్తోపాటు సీనియర్ నేతలు, ఎంపీలతో సమావేశమవుతారు. ఇలాఉండగా, పంజాబ్ రాజకీయాల్లో పైచేయి సాధించేందుకు అటు కెప్టెన్, ఇటు సిద్ధూ పోటాపోటీ సమావేశాలు జరుపుతున్నారు. సిద్ధూ వర్గం జరిపిన సమావేశానికి ఐదుగురు మంత్రులతోపాటు 10 మంది ఎమ్మెల్యేలు హాజరై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మరోవైపు కెప్టెన్ కూడా సిస్వాన్లోని తన ఫార్మ్ హౌస్లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించగా.. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో 117 సీట్లకు గాను 77 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోదీ హవా ఉన్నప్పటికీ 2017 ఎన్నికల్లో కెప్టెన్ అమరీందర్సింగ్ పార్టీని విజయవంతంగా అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ ఎన్నికల్లో అకాలీదళ్, బీజేపీకి 18 సీట్లు రాగా, ఆమ్ ఆద్మీ పార్టీకి 20 స్థానాలు వచ్చాయి.
ఆ గ్రామ ప్రజల్ని తరలించకండి: భారత్కు యూఎన్ లేఖ
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..