న్యూఢిల్లీ : వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులను పరిష్కరించకుండా ఉన్న పళంగా వారిని ఇతర ప్రాంతాలకు తరలించడం పట్ల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనరేట్ (ఓహెచ్సీహెచ్ఆర్) విస్మయం ప్రకటించింది. వానాకాలం సమస్యలతోపాటు కరోనా మహమ్మారి ఇబ్బందుల నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని ఓహెచ్సీహెచ్ఆర్ పేర్కొన్నది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా భారత్కు లేఖ రాసింది. హర్యానాలోని ఖోరీ గ్రామానికి చెందిన దాదాపు లక్ష మందిని తరలించకుండా చూడాలని భారతదేశం ప్రభుత్వానికి సూచించింది.
భారీ వర్షాల కారణంగా ఖోరీ గ్రామస్థులను మరో ప్రాంతానికి తరలించేందుకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కొందరు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనరేట్ దృష్టికి తీసుకెళ్లారు. ఖోరీ గ్రామస్థులకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా వర్షాలు కురుస్తున్నాయన్న సాకుతో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓహెచ్సీహెచ్ఆర్ కు విన్నవించారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనరేట్ కార్యాలయం.. ఇలాంటి పరిస్థితుల్లో ఖోరీ గ్రామస్థులను తరలించవద్దని, మౌలిక సదుపాయాలను కల్పించి ఆదుకోవాలని సూచించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయంతో ప్రజలు మరింత ఇబ్బందికి గురవుతారని పేర్కొన్నది.
ఇలాఉండగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ-ఫరీదాబాద్ సరిహద్దులో ఉన్న ఖోరీ గ్రామస్థులను మరోచోటికి తరలించేందుకు హర్యానా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిజానికి ఈ గ్రామంలోని దాదాపు 172 ఎకరాల భూమిని అటవీ భూమిగా గుర్తించారు. దీనిలోని 80 ఎకరాల్లో ప్రజలు ఇండ్లు కట్టుకుని నివసిస్తున్నారు. దీనిపై దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు 80 ఎకరాల్లో ఇండ్లను ఖాళీ చేయించాలని గత నెల 7న తీర్పునిస్తూ హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు విషయాన్ని దాచిపెట్టి కొందరు ఓహెచ్సీహెచ్ఆర్కు ఫిర్యాదు చేశారని, ఫలితంగానే ఇలాంటి సూచనలు వచ్చాయని అధికారులు చెప్తున్నారు.