హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలను శుక్రవారం నుంచే ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఇందుకు రైతులు, అధికారులు, మిల్లర్లు సహకరించాలని కోరారు. ధాన్యం కొనుగోలుపై అడిషనల్ కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ జిల్లా అధికారులతో బుధవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ముందుగా పంట చేతికొస్తున్న ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పారు. మే మొదటి వారం వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటవుతాయని, జూన్ మొదటివారంలోగా కొనుగోలు పూర్తిచేస్తామని చెప్పారు. ఈ యాసంగిలో రాష్ట్రంలో 36 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని చెప్పారు. ఇతర రాష్ర్టాల ధాన్యం రాకుండా సరిహద్దుల్లో 51 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
రైస్ మిల్లర్స్ రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా చర్యలు తీసుకున్నట్టు మంత్రి గంగుల తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతుకు, రైస్ మిల్లుకు ఎలాంటి సంబంధం లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా(ఎఫ్ఏక్యూ) ఉన్నటువంటి ధాన్యాన్నే కాంటా పెట్టి మిల్లుకు తరలించనున్నట్టు తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని, ప్రతి మిల్లుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించనున్నట్టు చెప్పారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో కేవలం మూడు రోజుల్లోనే డబ్బు జమ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలుకు రూ. 16 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశామని, ఈ మొత్తాన్ని బ్యాంకుల ద్వారా సమకూర్చేందుకు చర్యలు ప్రారంభించామని చెప్పారు. ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సొంతంగా రూ. 4650 కోట్లు భరించిందని తెలిపారు. రైతుల పేరుతో ఇతరులు ధాన్యం విక్రయించకుండా ప్రత్యేక డ్యాష్బోర్డ్ను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. కొనుగోలు కేంద్రానికి రైతు తన ధాన్యాన్ని తీసుకెళ్లినప్పుడు అతని ఆధార్ నంబరు ఆధారంగా ఆ రైతు ఎన్ని ఎకరాల్లో వరి వేశాడు? ఎంత దిగుబడి వస్తుందనే వివరాలన్నీ వచ్చేలా ఏర్పాటు చేశామని తెలిపారు. రైతు ఫోన్కు ఓటీపీ వెళ్లిన తర్వాతే ధాన్యం కొనుగోలు చేస్తారని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులందరూ ఒక్కసారే రాకుండా టోకెన్ల పద్ధతిని అమలు చేయనున్నట్టు తెలిపారు.
బండీ.. దమ్ముంటే కేంద్రం మెడలు వంచు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీకు భయపడి కాదు.. రైతుల బాధ చూడలేక, మానవత్వంతో సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. వరి వేయాలని చెప్పిన మీరు కొనుగోలు నుంచి పారిపోతే.. వరి వద్దన్న సీఎం ముందుకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఎవరు మెడలు వంచారని సీఎం కేసీఆర్ రైతుబంధు ఇచ్చారు? రైతుబీమా ఇచ్చారు? కాళేశ్వరం కట్టారు? ఉచిత విద్యుత్తు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే కేంద్రం, ప్రధాని మోదీ మెడలు వంచి తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలను దేశం మొత్తం అమలు చేయించాలని సవాల్ చేశారు. సీఎమ్మార్ ఇవ్వడం లేదని, బియ్యం మాయమయ్యాయంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గంగుల స్పందిస్తూ ఆ బియ్యం తమవి అని, వాటికి కేంద్రం ఏమైనా అడ్వాన్స్ ఇచ్చిందా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి వరి రైతులన్నా, వరి సాగు చేసే రాష్ర్టాలన్నా కోపమన్నారు. వరి సాగు చేసే తెలంగాణ, పంజాబ్, ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశాలో బీజేపీ ప్రభుత్వాలు లేకపోవడమే ఈ కోపానికి కారణమన్నారు.
సీఎం కేసీఆర్ మానవతకు మారుపేరని మరోసారి రుజువైందని మంత్రి గంగుల అన్నారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిన కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకొని పారిపోతే సీఎం కేసీఆర్ రైతులను ఆదుకొంటున్నారని తెలిపారు. కేంద్రం మోసంతో రైతులు అడ్డికి పావుశేరుకు తమ ధాన్యాన్ని అమ్ముకుంటుంటే సీఎం కేసీఆర్ చలించిపోయారని చెప్పారు. ఎంతో ఆవేదన చెంది.. రాజకీయాలను పక్కనపెట్టి రైతు నష్టపోవద్దనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారని తెలిపారు. దేశంలో రైతుల మొత్తం ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం
తెలంగాణ మాత్రమేనని మంత్రి పేర్కొన్నారు.