అభివృద్ధిలో పరుగులు తీస్తున్న కొడంగల్ నియోజకవర్గం రూపురేఖలు మారాయి. ఒకప్పుడు వెనుకబడిన ఈ ప్రాంతానికి ఐదేండ్లలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు రూ.2 వేల కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. అన్ని హంగులతో కొడంగల్, కోస్గి మున్సిపాలిటీ భవనాలను నిర్మించింది. మున్సిపాలిటీలు, గ్రామాలు, తండాల్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలతో అద్భుతంగా మారాయి. కోస్గి మున్సిపల్ పరిధిలో నిర్మించిన బస్డిపో అందుబాటులోకి వచ్చింది. రూ.19కోట్ల నిధులతో కొడంగల్, కోస్గిలో 50 పడకల దవాఖానలు, మద్దూర్లో 30 పడకల దవాఖానను అధునాతన హంగులతో నిర్మించడంతో పాటు కార్పొరేట్ స్థాయిలో ప్రజలకు వైద్య సేవలందుతున్నాయి.
‘మిషన్ భగీరథ’తో 220 గ్రామాలకు తాగునీటి సరఫరా అవుతున్నది. ‘పల్లె, పట్టణ ప్రగతి’తో గ్రామాలు, మున్సిపాలిటీల్లో పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్లు, వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్లను నిర్మించారు. రూ.39కోట్లతో ‘మిషన్ కాకతీయ’తో చెరువులు, కుంటల పునరుద్ధరణ, రూ.60కోట్లతో 17 చెక్ డ్యాంలు నిర్మించడంతో నియోజకవర్గంలో నీటి నిల్వలు పెరిగి సాగు విస్తీర్ణమూ పెరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల నిర్మాణంతో ఎంతో మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నది. కొడంగల్, మద్దూర్లలో డిగ్రీ కళాశాలల నూతన భవనాలు, దౌల్తాబాద్లో జూనియర్ కళాశాలను నిర్మించడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎకరంన్నర స్థలంలో బంజారా భవన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. త్వరితగతిన నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– కొడంగల్, నవంబర్ 8
కొడంగల్, నవంబర్ 8 : స్వరాష్ట్రంలో కొడంగల్ ప్రగతిలో పరుగులు పెడుతున్నది. నియోజకవర్గాభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపడంతో వేల కోట్ల రూపాయలతో ఈ ఐదేండ్ల కాలంలో ఊహించని రీతిలో అభివృద్ధి జరిగింది. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్రెడ్డి నియోజవర్గాన్ని పట్టించుకోలేదు. దీంతో ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురయ్యారు. సెగ్మెంట్ అన్నింటా వెనుకబడిపోయింది. అయితే 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పట్నం నరేందర్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. అంతేకాకుండా మంత్రి కేటీఆర్ ఈ సెగ్మెంట్ను దత్తత తీసుకోవడంతో రూ. వందల కోట్ల నిధులు మంజూరు కావడంతో ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రజల అవసరాలు ఒక్కొక్కటిగా సమకూరాయి. ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సెగ్మెంట్కు ప్రభుత్వం ఈ ఐదేండ్లలో రూ. రెండు వేలకు పైగా నిధులను మంజూరు చేసింది.
పాలనాసౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. బొంరాస్పేట మండలంలోని దుద్యాల, నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని కొత్తపల్లి, గుండుమాల్ గ్రామాలు కొత్త మండలాలుగా రూపుదిద్దుకున్నాయి. దుద్యాల, గౌరారం, చిల్ముల్మైల్వార్, నాస్కాన్పల్లి, అల్లిఖాన్పల్లి, ఈర్లపల్లి, లగచెర్ల, పోలెపల్లి, హకీంపేట, కుదురుమల్ల, ఆలేడ్, సండ్రకుంట తండా, సాగారంతండా, సత్కర్కుంటతండా, ఎక్కచెరువుతండా, చెట్టుమీదితండాలు దుద్యాల మండలంలో ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన మండలాల్లో తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలు, పోలీస్స్టేషన్, పీహెచ్సీలు ఏర్పాటు కావడంతో పాలన ప్రజలకు చేరువైంది.
నియోజకవర్గంలో ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పలు సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందుతున్నాయి. ఆసరా పింఛన్ల కింద వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితరులు 37,090 మందికి రూ.550 కోట్ల ఆర్థిక సాయం అందుతున్నది. అందులో కొడంగల్ మండలంలో 2569 మంది, కొడంగల్ మున్సిపాలిటీలో 1,344, కోస్గి మండలంలో 5,403, మద్దూర్లో 10,138, దౌల్తాబాద్లో 6,681, బొంరాస్పేటలో 6,102 మంది మొత్తంగా 37,312 మంది లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా రైతుబంధు పథకం కింద 93,708 మంది రైతులకు ఆర్థిక సాయం అందుతున్నది. కోస్గి, మద్దూర్ మండలాల పరిధిలో 2018 నుంచి 2023 వరకు 39,013మంది రైతులకు రూ.385కోట్ల పెట్ట్టుబడి సాయం అందింది. 2022 యాసంగిలో బొంరాస్పేట మండలంలో 16,055 మంది రైతులకు రూ.18 కోట్ల, దౌల్తాబాద్లో 16,846 మంది రైతులకు రూ.19 కోట్లు, కొడంగల్ మండలంలో 15,903 రైతులకు రూ.20 కోట్లు, కోస్గిలో 17,480 మంది రైతులకు రూ.19 కోట్లు, మద్దూర్లో 20,683మంది రైతులకు రూ.22 కోట్లు మంజూరయ్యాయి.
అదేవిధంగా రైతుబీమా కింద 1786 మంది రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.88.40 కోట్ల ఆర్థిక సాయం అందింది. రుణమాఫీ పథకం కింద 34,805 మంది రైతులు లబ్ధి పొందారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా నియోజకవర్గంలో 9,318 మంది పేదింటి ఆడబిడ్డల వివాహాలకు రూ.87కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించింది. 9,129 మంది మహిళలకు కేసీఆర్ కిట్లు, సీఎంఆర్ఎఫ్ ద్వారా 2.600 మంది పేదల వైద్య చికిత్సలకు రూ.15,80 కోట్ల ఆర్థిక సాయం అందింది. దళితబంధు పథకం ద్వారా అర్హులైన దళితులకు రూ.10 కోట్లతో వివిధ రకాల యూనిట్ల పంపిణీ, బీసీబంధు ద్వారా కులవృత్తులను ప్రోత్సహించేందుకు రూ.3 కోట్లు మంజూరయ్యాయి. గొర్రెల పంపిణీ పథకంలో 4,285 మంది గొల్ల, కురుమలకు రూ.47,56 కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేశారు.
పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. మున్సిపాలిటీలు, గ్రామాల్లో పట్టణ, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్లు, వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్ల నిర్మాణంతో స్వచ్ఛత ఏర్పడింది. రూ.400కోట్ల నిధులతో అన్ని గ్రామాలకు లింక్ రోడ్ల నిర్మాణం పూర్తైంది. దీంతో ప్రజలు సాఫీగా ప్రయాణం చేయగలుగుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణతో గ్రామాలు స్వచ్ఛతకు మారుపేరుగా మారాయి.
మద్దూర్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల్లో రోడ్ల విస్తరణతోపాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం రూ.13 కోట్లు మంజూరయ్యాయి. కొడంగల్ మండలంలోని పోచమ్మతండా పంచాయతీ పరిధిలోని మైసమ్మతండాకు వెళ్లే దారిలో ఉన్న వాగుతో వానకాలంలో పోచమ్మతండా, మైసమ్మతండా ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడేవి. అయితే ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.50 లక్షలు మంజూ రు కావడంతో బ్రిడ్జి నిర్మాణం పూర్తైంది. అదేవిధంగా చిట్లపల్లి-ఖాజాఅహ్మద్పల్లి గ్రామం మధ్యలోని వాగుపై వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో రూ.40లక్షలతో మరమ్మతులు చేస్తున్నారు. అదేవిధంగా దౌల్తాబాద్ మండలంలోని అల్లాపూర్ గ్రామంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.కోటీ 40లక్షలు మంజూరయ్యాయి. అదేవిధంగా విద్యు త్తు రంగంలోనూ ప్రభుత్వం ఎంతో ప్రగతిని సాధించింది. కొడంగల్లోని అన్నారం, దౌల్తాబాద్లోని నర్సాపూర్తోపాటు బొంరాస్పేట మండలాల్లోని ఆయా గ్రామాల్లో 33/11 కేవీ ఉప కేంద్రాలను ఏర్పాటు చేసింది.
నియోజకవర్గంలోని కొడంగల్, కోస్గి మున్సిపాలిటీలుగా ఏర్పాటయ్యాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం మొదటి విడుతలో రూ.15 కోట్ల చొప్పున మొత్తం రూ.30 కోట్లను మంజూరు చేసింది. ఆ నిధులతో పలు వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, రూ.2 కోట్ల50లక్షలతో వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం, వైకుంఠధామాలు తదితర అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.
మరింత అభివృద్ధిలో భాగంగా మలి దశ అభివృద్ధికి రెండు మున్సిపాలిటీలకు కలిపి రూ.20 కోట్లు మంజూరు కాగా ఆ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కాగా కోస్గి మున్సిపాలిటీ కార్యాలయ నూతన భవనం ప్రారంభమై కొనసాగుతున్నది. కోస్గి మున్సిపల్ పరిధిలో రూ.2 కోట్లతో చేపట్టిన బస్డిపో ప్రారంభమైనది. ‘పట్టణ ప్రగతి’లో భాగంగా రూ.60 లక్షలతో మినీ ఫుడ్జోన్ల నిర్మాణం, రూ.కోటితో కోస్గి బస్టాండ్ నిర్మాణం కాగా మరో రూ.30 కోట్లు మంజూరు కాగా రెండు మున్సిపాలిటీల్లోనూ అభివృద్ధి పనులు మరింత జోరుగా సాగాయి.
నియోజకవర్గంలో ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.6.20 కోట్లను మంజూరు చేసింది. ఇప్పటికే బంజారాభవన్, ముదిరాజ్ భవన్, యాదవభవన్, అంబేద్కర్ భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం స్థలాలు కేటాయించడంతోపాటు నిధులు మంజూరు కావడంతో పనులు సాగుతున్నాయి.
రూ.6 కోట్లతో ఆలయాల అభివృద్ధి.
నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్ మండలాల పరిధిలోని ఆలయాల అభివృద్ధికి రూ. 6 కోట్లు మంజూరయ్యాయి. కొడంగల్లో మహాలక్ష్మీవేంకటేశ్వరస్వామి, దౌల్తాబాద్లో వేంకటేశ్వరాలయం, మద్దూర్లో బావోజీ ఆలయం వంటి తదితర దేవాలయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే అన్ని వసతులతో గురుకుల పాఠశాలల భవనాలను నిర్మిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలల భవనాల నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరయ్యాయి. పట్టణ పరిధిలోని బండల ఎల్లమ్మ ఆలయ సమీపంలో రూ.4కోట్ల 57లక్షలతో డిగ్రీ కళాశాల నూతన భవనం, రూ.2కోట్లతో కస్తూర్బాగాంధీ కళాశాల భవనాలు, పాతకొడంగల్ ప్రాంతంలో రూ.4కోట్ల 20లక్షలతో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలను సర్కారు నిర్మించింది. అదేవిధంగా మన ఊరు-మన బడి పథకంలో భాగంగా మొదటి విడుతలో కొడంగల్ పరిధిలో 19 పాఠశాలలు ఎంపిక కాగా రూ.34 లక్షల 6వేలు, బొంరాస్పేట మండల పరిధిలో 25 పాఠశాలలు ఎంపిక కాగా రూ.4కోట్ల 4లక్షలు, దౌల్తాబాద్ మండల పరిధిలో 24 పాఠశాలలకు రూ. 5కోట్ల 80లక్షలు మంజూరయ్యాయి.
రూ.19 కోట్లతో కొడంగల్, కోస్గి, మద్దూర్ మండలాల్లో అధునాతన దవాఖాన భవనాలు రూపుదిద్దుకొన్నాయి. కొడంగల్ సివిల్ దవాఖానను 50 పడకలకు రూ.5 కోట్ల 50లక్షలతో విస్తరించారు. అదేవిధంగా రూ.కోటి నిధులతో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. శిథిలావస్థకు చేరిన మార్చురీని రూ.కోటితో ఆధునీకరించారు. కోస్గిలో 50 పడకల నూతన దవాఖాన భవనం, మద్దూర్ మండల కేంద్రంలో రూ.4 కోట్లు 75లక్షలతో 30 పడకల దవాఖాన భవనం ప్రారంభమై రోగులకు కార్పొరేట్ తరహాలో సేవలందుతున్నాయి. అదేవిధంగా కొడంగల్ దవాఖానలో రోగులకు ఉచిత భోజనాన్ని కల్పించి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు.
చెరువులకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి చెరువులు, కుంటల పూడికతీత పనులు చేపట్టింది. కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల పరిధిలో ఇప్పటివరకు రూ.39 కోట్లతో 140 చెరువులు, కుంటల్లో ‘మిషన్ కాకతీయ’లో పూడికతీత పనులు చేపట్టారు. దీంతో చెరువులు, కుంటల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది.
ప్రస్తుతం కొడంగల్లో 4708 ఎకరాలు, బొంరాస్పేటలో 12,979, దౌల్తాబాద్లో 8,738, కోస్గిలో 16000, మద్దూర్ మండలంలో 14000 ఎకరాలు మొత్తంగా 56,425 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. కొడంగల్ పెద్దచెరువు సుందరీకరణకు ప్రభుత్వం రూ.కోటీ60 లక్షలు మంజూరు చేసింది. దౌల్తాబాద్ మండలంలోని చెరువును రూ.7 కోట్ల 50లక్షలతో మినీ ట్యాంక్బండ్గా సుందరీకరిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో రూ.60 కోట్లతో 17 చెక్ డ్యాములను నిర్మించారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా నియోజకవర్గంలోని 220 గ్రామాల్లో ప్రతిరోజూ కోటీ90 లక్షల లీటర్ల తాగునీరు సరఫరా అవుతున్నది. ఇందుకోసం రూ.167 కోట్ల అంచనా నిధులతో గ్రిడ్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్రామాల్లో ట్యాంకులు, పైప్లైన్, ఇంటింటికీ నీటి సరఫరా నల్లాల ఏర్పాటు వంటి పనులకోసం రూ.17 కోట్లు ఖర్చయ్యాయి. మిషన్ భగీరథ ఏర్పాటు ముందు ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఇంటి ముందున్న నల్లాలోకే నీరు వస్తుండటంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.