బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పను 2020-21 సంవత్సరానికి ఉత్తమ శాసనసభ్యుడిగా ఆ రాష్ట్ర శాసనసభ ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అతిథిగా విచ్చేసిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు జ్ఞాపికను బహూకరించారు. లోక్ సభ, రాజ్యసభలో ఏటా అందించే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుల మాదిరిగా ఈ ఏడాది నుంచి కర్ణాటక శాసనసభ సభ్యులకు ఉత్తమ శాసనసభ్యుడి అవార్డు ఇచ్చే ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కగేరి తెలిపారు.
అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కర్ణాటక అసెంబ్లీలో ప్రసంగించారు. మనం ఏర్పాటు చేసుకున్న చట్టాలపై విస్తృతమైన చర్చలు జరుపడం మన విధి అని అన్నారు. ఏర్పడిన చట్టాలపై ఎలాంటి ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తకుండా ఎమ్మెల్యేలు మరింత చురుకుగా సభా కార్యకలాపాల్లో పాల్గోవాలని ఆయన సూచించారు.
కాగా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగం కోసం నిర్వహించిన ఉమ్మడి సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఇలాంటిది మునుపెన్నడూ జరుగలేదని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్దరామయ్య అన్నారు. కర్ణాటక శాసనసభలో కొత్త విధానాన్ని సృష్టించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.