నల్లగొండ : పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాలేజీ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్, నార్కట్పల్లి బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు పుల్లెంల వెంకట్ గౌడ్ను పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామునే వారిని అదుపులోకి తీసుకుని నార్కట్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా వాడపల్లి నవీన్ మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలను అణచివేయలేరని మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలన్నారు.
విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెలబెట్టుకోవడం లేదని.. హామీలను నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని.. రేవంత్ సర్కార్ గద్దె దిగే రోజులు ముందున్నాయని విమర్శించారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే తెలంగాణలో ఎక్కడా తిరగనివ్వమని స్పష్టం చేశారు.