Payal Rajput | ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరోయిన్ పాయల్ రాజ్పుత్ తాజాగా ఒక సినిమా వేడుకలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన వ్యక్తిగత జీవితంలోని విషాదాన్ని తలచుకుని వేదికపైనే కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న వారందరినీ కలిచివేసింది. హేమంత్ ఇప్పలపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘ఫస్ట్ టైమ్ 01-01-01’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో పాయల్ చిన్ననాటి స్నేహితుడు సౌరభ్ ధింగ్రా హీరోగా నటిస్తున్నాడు. స్నేహితుడిని ప్రోత్సహించేందుకు ముఖ్య అతిథిగా హాజరైన పాయల్, సినిమా గురించి మాట్లాడుతూ విజువల్ ఎఫెక్ట్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే ఈవెంట్ ముగింపు సమయంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్న ఆమెను భావోద్వేగానికి గురిచేసింది. గతంలో ఆమె విపాసన ధ్యానం కోసం వెళ్లిన విషయాన్ని ప్రస్తావించగా, పాయల్ తన తండ్రి విమల్ కుమార్ రాజ్పుత్ను గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. మా నాన్నే నా జీవితానికి హీరో. నేను చేసిన ప్రతి సినిమాను ఆయనే మొదట చూసి తన అభిప్రాయం చెప్పేవారు. రీసెంట్గా వచ్చిన నా పంజాబీ సినిమా చూడాలని ఆయన ఎంతో ఆశపడ్డారు. కానీ ఇప్పుడు ఆయన మన మధ్య లేరు” అంటూ పాయల్ వెక్కి వెక్కి ఏడ్చేశారు.
‘ఆర్ఎక్స్ 100’ వంటి బోల్డ్ చిత్రంలో నటించినప్పటికీ తన నటనను తండ్రి మెచ్చుకున్నారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలో భావోద్వేగాన్ని ఆపుకోలేక వేదికపై నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. చిత్ర బృందం ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆమె బాధ అందరినీ కదిలించింది. పాయల్ తండ్రి విమల్ కుమార్ రాజ్పుత్ గత ఏడాది జూలై 28న కన్నుమూశారు. అన్నవాహిక క్యాన్సర్తో పోరాడుతూ 67 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. తండ్రి అనారోగ్య సమయంలో కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు, మానసిక ఒత్తిడి గురించి పాయల్ గతంలో కూడా పంచుకున్నారు.ఆ బాధ నుంచి బయటపడేందుకు ఆమె విపాసన ధ్యానంను ఆశ్రయించారు. ఇది భారతదేశపు ప్రాచీన ధ్యాన విధానం కాగా, మనస్సును శాంతపరచడం, భావోద్వేగాలను నియంత్రించడం కోసం ఉపయోగపడుతుంది. ఈ ధ్యానం ద్వారా పాయల్ తన జీవితంలో జరిగిన విషాదాన్ని అంగీకరించి ముందుకు సాగేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.