హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): సొంత పార్టీ అభ్యర్థులతో సరిగా నామినేషన్లు వేయించలేని, ఎన్నికల్లో పోటీకి సహకరించని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన అడ్డగోలు హామీలను ఎలా తీరుస్తుందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఇప్పటికే ఒక కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించారని, మరో ఇద్దరు పోటీ నుంచి తప్పుకున్నారని, తాజాగా ఒడిశాకు చెందిన సుచిత్రా మొహంతి పోటీలో ఉండలేనని చేతులెత్తేశారని పేర్కొన్నారు.
ప్రచార ఖర్చుకు పార్టీ డబ్బు ఇవ్వడం లేదని ఆమె పోటీ నుంచి తప్పుకున్నారని, సొంత అభ్యర్థులనే కాపాడుకోలేని ఆ పార్టీ.. దేశంలో బీజేపీతో యుద్ధమెలా చేస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకే ఇప్పటికీ అతీగతీ లేదని, ఇప్పుడు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో ఇప్పించిన హామీలను అమలు చేసే దమ్ము ఆ పార్టీకి ఉన్నదా అని ప్రశ్నించారు. ఇదంతా కేవలం ప్రజలను బురిడీ కొట్టించి ఓట్లు వేయించుకోవడానికి చేస్తున్న డ్రామాలు తప్ప, వీళ్లకు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేదని పేర్కొన్నారు.