సిద్దిపేట: ఒక్కడితో మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం ఉధృతమై ఉప్పెనగా మారి స్వరాష్ట్ర కలను సాకారం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తి చేసి ప్రజలను కేసీఆర్ చైతన్యపరిచారని తెలిపారు. అంగబలం, అర్ధబలం కలిగిన ఆంధ్ర నాయకత్వాలను ఎదిరించి నిలబడ్డారని చెప్పారు. తెలంగాణ వాదాన్ని అణిచవేయాలన్న ప్రతిసారి ఉద్యమం మరింత ఉధృతం చేశారన్నారు. తన పదవులను గడ్డిపోచలుగా వదిలేసి ప్రజల్లో చర్చపెట్టి తెలంగాణ వాదాన్ని గెలిపించారన్నారు. జలదృశ్యం నుంచి జన దృశ్యంగా మారిన పరిణామంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు, అణచివేతలు, అనుమానాలు ఎదురయ్యాయని గుర్తుచేసుకున్నారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
23 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణంలో కేసీఆర్ ఎన్నడూ ఎత్తిన జెండా దించలేదని, పట్టిన పట్టును విడువలేదని చెప్పారు. గులాబీ జెండానే గులాంగిరీని అంతం చేసి తెలంగాణను తెచ్చిపెట్టిందని వెల్లడించారు. పదేండ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించిందన్నారు. ఈ ఘనత ముమ్మాటికీ గులాబీ జెండాదేనని చెప్పారు. ఆత్మగౌరవంతో బతికే జాతి తెలంగాణ జాతి అని వెల్లడించారు. ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడల్లా ధిక్కార స్వరమై నిలిచిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మాయమాటలు చెప్పి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదన్నారు. తెలంగాణకు నష్టం జరిగిన ప్రతిసారి బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాటం చేసిందని చెప్పారు. ఇప్పుడు మరోసారి ప్రజలకోసం ప్రజా ఉద్యమం చేసేందుకు బీఆర్ఎస్ సంసిద్ధమైందని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా సిద్దిపేటలో పార్టీ కార్యాలయంలో గులాబీ జెండాను హరీశ్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని చెప్పారు. మన పథకాలను బీజేపీ కాపీ కొట్టిందని విమర్శించారు. అభివృద్ధిలో కేసీఆర్ ఆదర్శంగా ఉంటే.. తిట్లలో రేవంత్ రెడ్డి ఆదర్శంగా ఉన్నారని చెప్పారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తే రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. నాడు ఓటుకు నోటు, నేడు దేవుళ్లపై ఒట్లు అంటూ ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. హామీలు అమయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.
గులాబీ జెండాకు 24 ఏళ్ళు…!!
భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు.
ఒక్కడితో మొదలైన బి ఆర్ ఎస్ ప్రస్థానం, ఉదృతమై ఉప్పెనగా మారి స్వరాష్ట్ర కలను సాకారం చేసింది.
తెలంగాణ జెండా ఎత్తిన్నాడు కేసీఆర్ వెంట పిడికెడు మంది… pic.twitter.com/EeL5GaqTq1
— Harish Rao Thanneeru (@BRSHarish) April 27, 2024