Padma Rao Goud | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ‘పజ్జన్న అంటే అషామాషీ కాదు.. ఎల్లవేళలా ప్రజా గొంతుకై నిలబడే వ్యక్తి.. పద్మారావు కాడికి పోతే సమస్య ఎలాంటిదైనా పరిష్కారం చూపుతాడన్న నమ్మకం నియోజకవర్గ ప్రజల్లో ఉన్నది. ఇప్పుడు ఆ నమ్మకాన్నే హైదరాబాదీ బిడ్డగా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అందిస్తా. సమస్యలపై పార్లమెంట్లో గళం విప్పి నియోజకవర్గ, రాష్ట్ర అభివృద్ధికి నా వంతు ప్రయత్నం చేస్తా. ఎంపీ ల్యాడ్స్ నిధులూ కూడా ఖర్చుచేయని ఏకైక ఎంపీ కిషన్రెడ్డి. మళ్లీ గెలిచినా ఆయన ప్రజలకు చేసేందేముంటది? దానం నాగేందర్కు క్యారెక్టర్ లేదు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు. లష్కర్ ప్రజల మద్దతు నాకే ఉన్నది. భారీ మెజార్టీతో గులాబీ జెండా ఎగరేస్తా’ అని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి టీ పద్మారావుగౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మంచి చెడు ఏదైనా అండగా ఉండే వ్యక్తినని చెప్పారు. ఎంపీగా గెలిచి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేని కిషన్రెడ్డికి ఈ సారి ఓటమి తప్పదని అన్నారు. అలవికాని హామీలు, మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలన నాలుగు నెలలకే ప్రజలకు అర్థమైందని, హస్తం అభ్యర్థులకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తోటి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఉద్యమకారులు, కార్యకర్తలు, అభిమానులు అందరి కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్తున్నామని, అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కే మరోసారి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి తన గెలుపునకు బాట అని, ఈ ఎన్నికల్లో లష్కర్పై గులాబీ జెండాను ఎగరవేసి పార్టీ అధినేత కేసీఆర్కు గిఫ్ట్గా ఇవ్వబోతున్నట్టు పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా అంటేనే నా నియోజకవర్గ ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకం.. నేను ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే వ్యక్తిని. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే వాడిని. నా నియోజకవర్గ ప్రజలకే కాదు.. హైదరాబాద్ ప్రజలకు పజ్జన్నగా సుపరిచితుడిని. పద్మారావు వద్దకు వెళితే సమస్య ఎలాంటిదైనా పరిష్కారం చూపుతాడన్న నమ్మకం నియోజకవర్గ ప్రజల్లో ఉన్నది. ఆ నమ్మకానే పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అందిస్తా. ప్రజా గొంతుకై పార్లమెంట్లో గళం వినిపిస్తా. 14 ఏండ్లు జై తెలంగాణ అన్నోడిని.. పార్లమెంట్లో గొంతు ఎత్తడం పెద్ద సమస్యే కాదు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రమే కాదు హైదరాబాద్ నగరం గణనీయమైన అభివృద్ధిని సాధించింది. అపారమైన అనుభవం, ముందుచూపు గల నేత కేసీఆర్ మార్గదర్శకంలో పురపాలకశాఖ మంత్రిగా తారకరామారావు హైదరాబాద్కు వన్నే తీసుకొచ్చి ప్రపంచ దేశాలు మనవైపు చూసేలా చేశారు. జోడ్డెద్దులా మాదిరిగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాయి. దురదృష్టవశాత్తు అలవికాని హామీలు ఇచ్చి.. అరచేతిలో స్వర్గం చూపించినట్టు నోటికొచ్చిన హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ, నాలుగు నెలల్లోనే రైతాంగం, గ్రామీణ ప్రజల్లో పొరపాటు చేశామనే భావన కనబడుతున్నది. పాదయాత్ర సమయంలో రూరల్ ఓటర్లు ఇదే రీతిలో స్పందిస్తున్నారు. పదేండ్ల అభివృద్ధి ముద్దు.. వంద రోజుల అబద్ధాలు వద్దని సబ్బండవర్ణాల ప్రజలు అంటున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఘోర పరాభావం తప్పదు.
ప్రజల శ్రేయస్సే ముఖ్యమనే ధోరణిలో పరిపాలన సాగాలి. కానీ ఈ ప్రభుత్వం ఒక్క రాజకీయ దృష్టితో కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నదే తప్ప సాగు, తాగునీటిపై ఎలాంటి ఆలోచన చేయడం లేదు. అవగాహనారాహిత్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నది. అనుభవం ఉన్న వారిని కలుపుకుని పోతేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ, ఇప్పుడున్న వారికి అనుభవం లేకనే ఈ సమస్యలు. బెంగళూరులో ప్రజలు తాగునీటికి అల్లాడిపోతున్నారు? హైదరాబాద్లో తాగునీటి ఎద్దడి చాలా బస్తీలు, కాలనీల్లో ఉన్నది. మూడు రోజులైనా వాటర్ ట్యాంకర్ దొరకని దుస్థితి. వాటర్ ట్యాంకర్ భారం కనీసంగా ఒక్క అపార్ట్మెంట్పై నెలకు రూ.15 వేలు పడుతున్నది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. బీఆర్ఎస్ పాలనలో తాగు, సాగునీటిని అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం. ఆ దిశగా ఫలితాలు రాబట్టాం. కానీ, కాంగ్రెస్ పాలకుల తీరుతో మున్ముందు మరిన్నీ సమస్యలు ఎదురవుతాయి.
సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గెలిచిన కిషన్రెడ్డి కేంద్ర మంత్రి అయిండు కానీ.. ఆ సంతోషాన్ని ప్రజలకు ఇవ్వలేకపోయిండు. నియోజకవర్గంలో ఏనాడూ అందుబాటులో లేడు. కేంద్రమంత్రిగా కోట్ల నిధులతో అభివృద్ధి చేసే అవకాశం ఉంటది. కానీ కిషన్రెడ్డి అదనపు నిధులు కాదు కదా.. కనీసం ఎంపీ ల్యాడ్స్ నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయకుండా దేశంలోనే ఏకైక ఎంపీగా కిషన్రెడ్డి నిలిచిండు. నాకు తెలిసి నియోజకవర్గంలో కిషన్రెడ్డి రెండే రెండు అతి గొప్ప పనులు చేసిండు. ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఒకటి, ఓ స్కూల్ వద్ద రేకుల షెడ్డులు వేసిండు. కానీ మా ప్రభుత్వంలో ఒక్క హైదరాబాద్లోనే 34 ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులు చేపట్టాం. కిషన్రెడ్డి మాత్రం అంబర్పేట ఫ్లై ఓవర్ ఒక్కటి పూర్తి చేయలేక పోయిండు.
హిందువులు అనేది బీజేపీకి ఏదైనా ఆధార్ కార్డా? వాళ్లు జై శ్రీరామ్ అంటే.. మనం ఏమైనా జై రావణాసురా.. అంటమా? బీజేపీ కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికే మతాన్ని తెరమీదకు తెస్తున్నది. ఈ మతతత్వ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్కు కొమ్ముకాసి సామాన్యుడి జీవనాన్ని చిన్నాభిన్నం చేసిందని ప్రజలకు అర్థమైంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఓ మినీ ఇండియా. ఉత్తర భారతీయులతోపాటు క్రైస్తవులు, మైనార్టీలు ఇలా సబ్బండవర్ణాలతో కులాలకు, మతాలకు అతీతంగా బీఆర్ఎస్ పాలనలో అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో అమిత్షా, నితిన్ గడ్కరీ లాంటి అగ్రనేతలు వచ్చి ప్రచారం చేసినా ఐదింటికి ఐదు కార్పొరేషన్ స్థానాలను గెలిచాం. ఇది ఇక్కడి ప్రజలకు ఉన్న చైతన్యం. కిషన్రెడ్డి ఈ నియోజకవర్గంలో ఫెయిల్ అయిండు కాబట్టే మేం అత్యధిక మెజార్టీతో లష్కర్పై గులాబీ జెండాను ఎగరవేయబోతున్నాం.
దానం నాగేందర్ క్యారెక్టర్ లేని వ్యక్తి. ఆ వ్యక్తి గురించి నాకంటే నియోజకవర్గ ప్రజలకే బాగా తెలుసు. ఇంటి నుంచే బయటకు రాలేని దుస్థితిలో ఉన్నాడు. దానం అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్కు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వెళ్లిన దానం.. గతంలోనే ప్రజల చేతిలో ఓడిపోయాడు. ఇప్పుడు కూడా దానంకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరు.