యాదాద్రి భువనగిరి, మే 4 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ పార్టీ పార్టీ భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశ్కు మంచి ఆదరణ లభిస్తున్నది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎర్రటి ఎండలోనూ మల్లేశ్ ప్రచారంలో దూసుకెళ్తుండగా, ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్న కసి కార్యకర్తల్లో కనిపిస్తున్నది. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు ఎన్నికల బాధ్యతలను తమ భుజాలకెత్తుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో భువనగిరిలో పొలిటికల్ హీట్ పెరిగింది. కదన రంగంలో బీఆర్ఎస్ జోరు మీదుంది. కారు పార్టీ.. బీజేపీ, కాంగ్రెస్ను ఓవర్టేక్ టాప్ గేర్లో దూసుకెళ్తున్నది. ఉదయం 7 గంటల నుంచే బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం ప్రచారం ప్రారంభిస్తున్నారు. గ్రామగ్రామాన ఇంటింటికీ వెళ్లి క్యాంపెయిన్ చేస్తున్నారు. పల్లెల్లో ర్యాలీలు తీస్తున్నారు. ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, కండువాలే దర్శనమిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్కు వణుకు పుట్టేలా ప్రచారం హోరెత్తుతున్నది. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ పార్టీలోని అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా నిత్యం మూడు నుంచి, నాలుగు మండలాలను కవర్ చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రజలకు వివరిస్తున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రచారం, సమావేశాలు, ఇతర బాధత్యలన్నింటినీ భుజాలకెత్తుకుంటున్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, బూడిద భిక్షమయ్య గౌడ్, మంచిరెడ్డి కిషన్రెడ్డి పల్లెపల్లెకూ తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు.
బీఆర్ఎస్ గెలుపు కోసం సీనియర్ నేతలు వివిధ వర్గాలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. బూత్ స్థాయిలో కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది.. ఎలా అండగా నిలిచింది వివరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో భాగంగా మహిళలు బోనాలు, బతుకమ్మలు, కోలాటాలు, డప్పుచప్పుళ్లతో ఘన స్వాగతం పలుకుతుండడం విశేషం.
భువనగిరి పార్లమెంట్ పరిధిలో నెల రోజుల్లో సీన్ రివర్ అయ్యింది. క్షేత్రస్థాయిలో మంచి కేడర్తో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరింత పుంజుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేడర్ కాస్త డీలా పడినా.. మళ్లీ జోరు పెరిగింది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు రోడ్షోలతో ఫుల్ జోష్ కనిపిస్తున్నది. నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పని చేస్తున్నారు.
క్యామ మల్లేశ్కు తోడు ఆయన కటుంబ సభ్యులు కూడా ప్రచారం చేస్తున్నారు. తండ్రిని గెలిపించుకునేందుకు ఆయన కూతురు ఆరోనికృష్ణకాంత్ అమెరికా నుంచి వచ్చి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. యువత, వృద్ధులు, చిన్ననాటి స్నేహితులు, వారి కుటుంబ సభ్యులను స్వయంగా కలుస్తున్నారు.