హైదరాబాద్, జూన్ 4 (నమస్తేతెలంగాణ): ‘ఉద్యమకారుల గుర్తింపును ప్రహసనంగా మార్చొద్దు. కమిటీల పేరిట కాలయాపన చేయొద్దు. కమిటీకి బదులు చట్టబద్ధమైన అధికారాలు కలిగిన డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి’ అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేకరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన కుటుంబాలకు, ఉద్యమకారులకు న్యాయం చేయాల్సిన బాధ్యత సర్కార్పై ఉన్నదని స్పష్టంచేశారు.
కేసీఆర్ హయాంలో 610 మంది అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఇచ్చారని, ఇంటికో ఉద్యోగం ఇచ్చి ఆదుకొన్నారని, 582 మంది కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారని గుర్తుచేశారు. సచివాలయంలో కేశవరావు నేతృత్వంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సర్వసభ్య సమావేశానికి హాజరై వారు వాదనలు వినిపించారు. అనంతరం తెలంగాణ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. సచివాలయంలోకి సామాన్య ఉద్యమకారులు పోవడం కష్టమని, అందుకే అమరవీరుల స్తూపంలోనే ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అమరుల కుటుంబాలకు ప్రతినెలా రూ.25 వేల పింఛన్ ఇవ్వాలని, 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని దాసోజు శ్రవణ్, కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు. కానీ గుర్తింపు కమిటీ సిఫార్సులనే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పి హామీలను ఎగ్గొడితే ఊరుకొనేదిలేదని హెచ్చరించారు. రెండున్నరేండ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 679 జారీచేసి అమరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు.
కేసీఆర్ సీఎం అయిన వెంటనే తొలి బడ్జెట్లోనే రూ.100 కోట్లు కేటాయించిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ, ప్రస్తుత రేవంత్ సర్కార్ నయాపైసా కేటాయించకపోవడంతో ఆయన చిత్తశుద్ధిపై అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. ఓట్లు కొల్లగొట్టేందుకు నాటకాలాడితే ఊరుకొనే ప్రసక్తిలేదని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు వై సతీశ్రెడ్డి, కిశోర్గౌడ్, రాఘవేంద్ర, విద్యాసాగర్, అంజన్రావు, రవినాయక్, శీనునాయక్ పాల్గొన్నారు.